వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణాలకే ముప్పు: డాక్టర్ లిల్లీ మేరి
సిరా న్యూస్,సిద్దిపేట;
వేసవికి ముందే … ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి వేసవి తీవ్రత పెరిగిపోతుంది. నేటి బిజీ జీవితంలో ఎండకు బయటకు రాకుండా ఉండలేని పరిస్థితి. అయితే, ఎండలో ఎక్కువగా తిరిగితే వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంది. వేసవిలో ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వడదెబ్బ తగిలిన తర్వాత అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణాలకే ముప్పుగా మారుతుందని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి హెచ్చరించారు.
లక్షణాలు:
ఎండలో ఎక్కువగా తిరిగే వారిలో నీటి శాతం తగ్గిపోతుంది. శరీరంలో సత్తువ కోల్పోవడం, నీరసం, బరువు తగ్గటం, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కండరాలు పట్టేయడం, తలనొప్పిగా ఉండటం, కళ్ళు బైర్లు కమ్ముతాయి. కొంతమందిలో విపరీతంగా జ్వరం రావడం, సొమ్మసిల్లి పోతుంటారు. మూత్రం పచ్చగా వస్తుంటే వడదెబ్బకు సూచిక గా భావించాలి. అందరిలో నోరు, నాలుక ఎండిపోయే అవకాశం ఉంది. చివరిగా వడదెబ్బ (హీట్ స్ట్రోక్) తగులుతుంది అని సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి తెలిపారు.
ఇలా చేయొద్దు:
వేసవికాలంలో మద్యం సేవించకపోవడం మంచిది. రోడ్లపై విక్రయించే పానీయాలు సేవించవద్దు. రోడ్లపై అమ్మేఆహార పదార్థాలు తీసుకోవద్దు. మాంసాహారం తగ్గించి తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీళ్లు, పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. ప్రతిరోజు కనీసం 10 నుంచి 15 గ్లాసులు నీళ్లు తాగాలి. రోజుకు రెండు పూటలా స్నానం చేయాలి. బయట పడుకునే వారు దోమతెరలు వినియోగించాలి. ఇంటి కిటికీలు తెరిచే ఉంచాలి అని సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి పేర్కొన్నారు.
వడదెబ్బ తగిలితే…
వడ దెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశాలు, చుట్టూ నీడకు చేర్చాలి. గాలి వెలుతురు ప్రసరించే ప్రదేశాల్లో పడుకోబెట్టాలి. చల్లటి దుస్తులు కప్పాలి. శరీరం వేడిగా ఉంటే తడి వస్త్రముతో శుభ్రంగా తడవాలి. ఉప్పు, పంచదార కలిపిన నీళ్లను గంట గంటకు తాగించాలి. బాధితులు అపస్మారక స్థితిలో ఉంటే నీటిని తాగించవద్దు. కొందరికి వడదెబ్బ తగిలినప్పటికీ చెమట రాదు. ఇటువంటి వారు ఎక్కువగా నీళ్లు తాగాలి. కొందరిలో ఫిట్స్ వచ్చి, కోమాలోకి జారుకుంటుంటారు. వారిని వెంటనే ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించాలి అని సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి తెలిపారు.
డీ హైడ్రేషన్ కాకుండా జాగ్రత్త పడాలి
ఎండలో తిరిగే వారిలో నీటి శాతం తగ్గిపోతుంది. దీంతో వారు త్వరగా వడదెబ్బ బారిన పడతారు. అలాగే డీ హైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. నాలుక పై తడి తగ్గటం వల్ల పొడిగా మారుతుంది. తరచుగా పెదాలు తడుపుకునే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వారికి వెంటనే నీటి శాతం పెంచే ప్రయత్నం చేయాలి . బాధితులు డీ హైడ్రేషన్కు గురైతే బీపీ తగ్గిపోతుంది. రక్తప్రసరణలో తేడా రావటం వల్ల గుండె, కిడ్నీల పనితీరు మందగిస్తుంది. దీంతో ఇతర అవయవాల పనితీరులో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇలాంటి వారిని వెంటనే ఆస్పత్తులకు తరలించి చికిత్సలు అందించాలని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి అన్నారు.
ఈ జాగ్రత్తలు పాటిస్తే …
ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎండలో బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఏమైనా పనులు ఉంటే ఉదయం, సాయంత్రం సమయాల్లో చేసుకోవాలి. తప్పనిసరిగా బయటకు వెళ్లేవారు ముందుగా సాధ్యమైనంత వరకు ఎక్కువ నీటిని తాగాలి. ఎండకు రక్షణగా గొడుగు, టోపీలు, హెల్మెట్ ను ధరించడం మంచిది. వేసవిలో లూజుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. ఉద్యోగులైన భార్యాభర్తలు ఇంట్లో ఉండే వృద్ధులు, చిన్నపిల్లలకు అందుబాటులో మంచినీళ్లు ఉంచాలి. మూత్రం పచ్చ రంగులో ఉంటే సాధారణ రంగుకు మారేంతవరకు నీళ్లను తాగుతూనే ఉండాలి. ఆల్కహాలు, స్పైసీ ఫుడ్, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములకు దూరంగా ఉండాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, నిమ్మరసము, కొబ్బరి నీళ్లు, రాగి అంబలి, నిత్యము తాగటం మంచిది. కీర, దోస, పుచ్చ పండు తినడం మంచిది లేదా వాడితో తయారు చేసిన జ్యూసులు తాగాలని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి అన్నారు.