సిరాన్యూస్, బేల
బేలలో ఘనంగా మహాత్మా బసవేశ్వరస్వామి జయంతి వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో మహాత్మా బసవేశ్వర జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మహాత్మా బసవేశ్వర చిత్రపటానికి ఆ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి జెండాను ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ బసవేశ్వరుడు సమాజంలో కుల వ్యవస్థ, వర్ణ బేధాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయవాదని అన్నారు. బసవేశ్వరుడు తన బోధనల ద్వారా సమాజంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం కోసం పోరాడారన్నారు.వర్ణాంతర వివాహాలు ప్రోత్సహించారని, ఆనాటి సాంప్రదాయ వ్యవస్థను వ్యతిరేకించిన వ్యక్తి అని చెప్పారు. మనుషులంతా ఒకటేనని, కులాలు, ఉపకులాలు లేవని బోధించారని తెలిపారు. ఆహారం, ఇల్లు, బట్ట, జ్ఞానం, వైద్యం మానవుని కనీస హక్కులని బసవేశ్వరుడు ఉద్బోధించారని ఆయన అన్నారు. విగ్రహారాధనను వ్యతిరేకించారని, దేహమే దేవాలయమని భావించారని అన్నారు. స్త్రీ, పురుష భేదం లేదని, శ్రమకు మించిన సౌందర్యం లేదని నమ్మిన వ్యక్తి బసవేశ్వరుడని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీ ల నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.