Bhargav Deshpande: భార్గవ్ దేశ్ పాండే కేసులో మళ్లీ ట్విస్ట్

సిరా న్యూస్, డిజిటల్:

భార్గవ్ దేశ్ పాండే కేసులో మళ్లీ ట్విస్ట్

– ఎత్తివేసిన సస్పెన్షన్ను ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేసిన చిన్నారెడ్డి!?

– ఆర్డర్ కాపీని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న కంది శ్రీనివాసరెడ్డి అనుచరులు

ఆదిలాబాద్ డిసిసి మాజీ అధ్యక్షులు భార్గవ్ దేశ్ పాండే సస్పెన్షన్ ఎత్తివేత వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనతో పాటు గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, సంజీవరెడ్డి లపై కాంగ్రెస్ పార్టీ  క్రమశిక్షణ సంఘం సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు వారు ప్రత్యక్షంగా దూరంగా ఉంటూ వచ్చారు. ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో పరిస్థితులు మారాయి. దీంతో మార్చి 9 న భార్గవ్ దేశ్ పాండే పై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేస్తున్నట్లు పీసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పార్టీ ఓటమి కోసం పనిచేసిన వారిపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు విధించిన కాంగ్రెస్ నాయకత్వానికి సమాచారం లేకుండా అందులో ఒకరిపై సస్పెన్షన్ ఎత్తివేత అంశాన్ని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ ద్రుష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇప్పటికీ కూడా  భార్గవ్ దేశ్ పాండే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కంది శ్రీనివాస్ రెడ్డి దీపదాస్ మున్షీకి విన్నవించినట్లు సమాచారం. దీంతో దీపదాస్ మున్షీ ఆదేశాలతో భార్గవ్ దేశ్ పాండే పై సస్పెన్షన్ ఎత్తివేత ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు చిన్న రెడ్డి స్పష్టం చేశారు. భార్గవ్ దేశ్ పాండే పై మరో ఆరేళ్ళపాటు సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా భార్గవ్ దేశ్ పాండే రాకను కాంగ్రెస్ పార్టీలో పలువురు నాయకులు స్వాగతించగా, కంది శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ పరిణామాల దృష్ట్యా భార్గవ్ దేశ్ పాండే పై సస్పెన్షన్ కొనసాగుతుందని చిన్నారెడ్డి స్పష్టం చేయడం ఆదిలాబాద్ లో చర్చనీయాంశంగా మారింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *