సిరా న్యూస్,అంబర్ పేట;
జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న పాత నేరస్తుల్ని అంబర్పేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అతని నుంచి ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అంబర్ పేట ఇన్స్పెక్టర్ డి. అశోక్, అడిషనల్ ఇన్స్పెక్టర్ డి. మల్లేశ్వరి దొంగతనానికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. అంబర్ పేట ప్రేమ్ నగర్ లో నివసిస్తున్న మచ్చ వెంకట్ రావు అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. డబ్బులు సరిపోకపోవడంతో బైక్ దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. 10 సంవత్స రాల నుంచి ఈ దొంగతనాలు చేస్తున్నాడు. రోడ్డు పక్కన నిలిపిన బైక్ లను డూప్లికేట్ తాళం చెవి ఉపయోగించి దొంగతనం చేస్తాడు. ఇంతకుముందు నగరంలోని శాహినాజ్ గంజ్, అంబర్ పేట పోలీస్ స్టేషన్ లలో దొంగతనాలకు పాల్పడి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఈనెల 12వ తేదీన అంబర్ పేట అలీ కేఫ్ చౌరస్తాలో గల ఓ వైన్ షాప్ దగ్గర షేక్ హుస్సేన్ అనే వ్యక్తి తన బైక్ ను పార్కింగ్ చేశాడు. ఆ బైక్ ను మచ్చ వెంకట్ రావు దొంగిలించారు. షేక్ హుస్సేన్ తన బైక్ దొంగిలించబడిందని గ్రహించి అంబర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సిసి కెమెరాల ద్వారా వెంకట్రావు బైక్ దొంగిలించినట్లు గుర్తించారు. ఈరోజు అతడు ఇంట్లో ఉండగా అతని పట్టుకొని అతని నుంచి ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.