సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూతో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో, పశు సంవర్థక శాఖ అధికారులు, యంత్రాంగం అప్రమత్తమయ్యారు. కోళ్లకు సంబంధించిన శాంపిల్స్ ను భోపాల్ లోని టెస్టింగ్ కేంద్రానికి పంపించారు. నెల్లూరులోని చాటగుట్ల, గుమ్మళ్లదిబ్బలో వేలాది కోళ్లు చనిపోయాయి. వీటిని పరిశీలించిన అధికారులు బర్డ్ ఫ్లూతోనే మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చారు. కోళ్ల కళేబరాల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం పంపించారు. ఈ నేపథ్యంలో కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి 10 కి.మీల పరిధిలోని ప్రాంతాల్లో 3 రోజుల పాటు చికెన్ షాపులు మూసివేయాలని.. కిలో మీటర్ పరిధిలోని ప్రాంతాల్లో చికెన్ షాపులు 3 నెలల పాటు మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని సూచించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని.. బర్డ్ ఫ్లూపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్దేశించారు.నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వేగంగా వ్యప్తి చెందుతున్నట్లు వైద్యులు గుర్తించారు. పొదలకూరు, కోవూరులో తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. వైరస్ నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా అధికారి ఆదేశించారు. వెంటనే గ్రామాల పరిధిలోని పది కిలోమీటర్ల వరకు మూడు రోజులు చికెన్ షాపూలు మూసివేయించాలని ఆదేశించారు. కిలోమీటర్ పరిధిలోని షాపులు మూడు నెలల వరకు తెరవకుండా చూడాలని సూచించారు.ఇక బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను ఎవరూ తినొద్దని తెలిపారు. చనిపోయిన కోళ్లను పాతిపెట్టాలని, బయట పడేయవద్దని పేర్కొన్నారు. కోళ్ల ఫాంలు, చికెన్ షాపుల్లో పనిచేసేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోడి గుడ్ల, చికెన్ తినకపోవడం చాలా మంచిదని తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటికే నెల్లూరు జిల్లాలో చికెన్ అమ్మకాలు పడిపోయాయి. ప్రజలు తినడం మానేశారు.ఇక అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు ఉన్న మేడారం జాతర వేళ.. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ సోకడం కలకలం రేపుతోంది. జాతర అంటేనే కోళ్లు, మేకలు కచ్చితంగా ఉంటాయి. ఈ సమయంలో వైరస్ సోకడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. మేడారం జాతరకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గడ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. ఇక కోళ్లు, మేకలను వ్యాపారులు తెలుగు రాష్ట్రాలతోపాటు, పొరుగున ఉన్న మహారాష్ట్ర ఛత్తీస్గడ్ నుంచి దిగమతి చేస్తారు. వీటితోపాటు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని చాలా మంది భయపడుతున్నారు. ఇప్పటికే జాతర నేపథ్యంలో కోట్ల కొద్ది కోళ్లను లక్షల కొద్ది మేకలను డంప్ చేశారు వ్యాపారులు ఇందులో వైరస్ ఉన్న కోళ్లు వస్తే జాతర కారణంగా తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా వైరస్ సోకే అవకాశం ఉంది.