బీజేపీకి మిత్రపక్షాలే మైనస్సా…

సిరా న్యూస్,న్యూఢిల్లీ;
సార్వత్రిక ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. మంగళవారం అసలు ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలు ప్రజానాడిని పూర్తిస్థాయిలో పసిగడతాయా లేదా అన్న చర్చను కాసేపు పక్కనపెడితే.. ఆదివారం అంచనాలు విడుదల చేసిన అన్ని సంస్థలు కేంద్రంలో “భారతీయ జనతా పార్టీ (BJP)” సారథ్యంలోని “నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)” విజయం సాధిస్తుందని తేల్చి చెప్పాయి. అబ్ కీ బార్ చార్ సౌ పార్ అన్న నినాదంతో 400 సీట్లు దాటి గెలుపొందాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలదళం.. ఆ లక్ష్యాన్ని చేరుకుంటుందని ఓ రెండు సర్వే సంస్థలు అంచనా వేశాయి. 2019లో సొంతంగానే 303 సీట్లు సాధించి, కూటమిగా 352 సీట్ల సంఖ్యను చేరుకోగా.. ఈసారి సగటున కూటమి 350 సీట్లు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ ఫలితాల సారాంశం. టీవీ9-పీపుల్స్ ఇన్‌సైట్, పోల్‌స్ట్రాట్ సంస్థతో కలిసి నిర్వహించిన సర్వే ప్రకారం ఎన్డీఏకు దాదాపు 350 సీట్లు వస్తాయని తేలింది. 2019తో పోల్చితే మిత్రపక్షాల సంఖ్యను పెంచుకున్నప్పటికీ వాటిలో కొన్ని ప్రధాన పార్టీలు బలహీనంగా ఉండడం వల్ల అనుకున్న లక్ష్యం చేరుకోవడం కష్టసాధ్యంగా మారిందని అర్థమవుతోంది. ఫలితంగా 400 దాటాలన్న ఎన్డీయే కల నెరవేరేలా కనిపించడం లేదు. నితీష్ కుమార్, ఓం ప్రకాష్ రాజ్‌భర్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ వంటి మిత్రపక్షాల నేతల ఈసారి ఎన్డీయేకు బలహీనమైన భాగస్వాములుగా మారారు.దేశంలోని 543 లోక్‌సభ స్థానాల్లో, BJP నేతృత్వంలోని NDAకి 346 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమికి 162 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అదే సమయంలో ఇతర పార్టీలకు 35 సీట్లు దక్కవచ్చని పేర్కొంది. ఎన్డీయేకు వచ్చే 346 సీట్లలో బీజేపీకి 311 సీట్లు, మిగిలిన మిత్రపక్షాలకు 35 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన 2019 కంటే బీజేపీ సీట్లు పెరిగాయి. కానీ మిత్రపక్షాల సీట్లు తగ్గుతున్నాయి. ముఖ్యంగా బీహార్, మహారాష్ట్రల్లో ఎన్డీయేకు ఎదురుదెబ్బ తగిలిందని స్పష్టమవుతోంది. ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం ఎన్డీయేలోకి తిరిగొచ్చిన చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ, జయంత్ చౌదరి సారథ్యంలోని రాష్ట్రీయ లోక్‌దళ్ అనుప్రియా పటేల్ సారథ్యంలోని అప్నాదళ్ (ఎస్) మినహా మిగిలిన బీజేపీ మిత్రపక్షాల పనితీరు ఈసారి బలహీనంగా ఉంది. బీహార్‌లో నితీష్‌ కుమార్‌కు చెందిన జనతాదళ్ (యునైటెడ్), మహారాష్ట్రలో షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్‌పవార్‌కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పనితీరు పేలవంగా ఉంది. తిరిగి ఎన్డీయేలోకి వచ్చిన చిరాగ్ పాశ్వాన్ పార్టీ కూడా ఈసారి బలహీనంగా ఉందని తేలింది. అలాగే ఓం ప్రకాష్ రాజ్‌భర్ తన కొడుకును గెలిపించడంలో సఫలీకృతం కావడం లేదని అంచనాలు చెబుతున్నాయి.2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని మొత్తం 40 సీట్లకు గాను ఎన్డీయేకు 39 సీట్లు గెలుపొందింది. కానీ ఈసారి సీట్లు తగ్గుతున్నాయని వివిధ సర్వేలు చెబుతున్నాయి. టీవీ9-పోల్‌స్ట్రాట్ సర్వే ప్రకారం ఎన్డీఏకు 27 సీట్లు, విపక్ష కూటమికి 12 సీట్లు వస్తాయని తేలింది. మిగిలిన 1 స్థానం ఈ రెండు కూటముల్లో లేని పార్టీకి దక్కవచ్చు. సర్వే ప్రకారం కూటమి పొత్తుల్లో భాగంగా బీజేపీ పోటీ చేస్తున్న మొత్తం 17 స్థానాలు గెలుచుకుంటుందని, కానీ జేడీయూ పోటీ చేస్తున్న 17 సీట్లలో కేవలం 7 మాత్రమే గెలుపొందుతుందని తేలింది. అదే సమయంలో, చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తన కోటాలోని 5 సీట్లలో 4 గెలుచుకుంటారని వెల్లడైంది. బీహార్‌లో ఎన్డీయే నష్టపోతుంటే మిత్రపక్షాల పనితీరు లేకపోవడమే అందుకు కారణం. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, 2019 పోటీలో JDU సీట్లు తగ్గుతున్నందున బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బలహీనమైన లింక్ అని రుజువు చేస్తున్నారు. గత ఎన్నికల్లో జేడీయూ 16 సీట్లు గెలుచుకోగా, ఈసారి కేవలం 7 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఈ విధంగా జేడీయూ 9 సీట్లు, చిరాగ్ పాశ్వాన్ ఒక సీటును కోల్పోతుండగా.. కూటమిలో మరో భాగస్వామిగా ఉన్న ఉపేంద్ర కుష్వాహా కూడా తన సీటును గెలుచుకోలేరని తేలింది. అలా మొత్తంగా బిహార్‌లో కూటమి స్కోరులో 11 సీట్లు తగ్గుతుండగా.. బీజేపీ స్కోరులో మాత్రం తేడా రావడం లేదు.బీహార్‌లో జేడీయూ సీట్లు తగ్గడం వల్ల నితీష్ కుమార్ ప్రస్తుత ఎన్డీయేలో బలహీనమైన భాగస్వామి అని, ఆయనపై ప్రజల్లో ఆగ్రహం ఉందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు సూచిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *