సిరా న్యూస్, గుడిహత్నూర్:
మంత్రాల నెపంతో ఒకరిపై హత్యాయత్నం..!
+ వృద్ధుడిపై గొడ్డలితో విరుచుకుపడిన దుండగలు
+ దాడిలో వృద్ధుడి దగ్గరి బందువు హస్తం ఉన్నట్లు అనుమానం
+ హత్యకు రూ. 3లక్షల సుపారి?
+ పోలీసుల అదపులో ముగ్గురు నిందితులు
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామానికి చెందిన బెడాడే శంకర్(55) అనే వృద్ధుడిపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు విచక్షణ రహితంగా గొడ్డలితో దాడి చేసిన సంఘటన శనివారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం… శంకర్ మేకల మేపడానికి గ్రామ శివారు ప్రాంతానికి వెళ్లాడు. కాగా అక్కడకు చేరుకున్న ఇద్దరు యువకులు శంకర్ చేతిలోని గొడ్డలి లాక్కొని అతనిపై తీవ్రంగా దాడి చేసారు. ఈ దాడిలో వృద్ధుడి మెడ, వీపుపై తీవ్ర రక్తగాయాలయ్యాయి. దీంతో వృద్ధుడు ఎలాగోలా వారి నుంచి తప్పించుకొని గ్రామం వైపు పరిగెత్తాడు. గమనించిన దుండగులు సైతం అక్కడి నుంచి పరారయ్యారు. కాగా శంకర్ రక్తపు మడుగులో రోడ్డుపై పడిపోవడంతో గుర్తించిన స్థానికులు అతని కుటుంబీకులకు సమాచారం అందించగా, శంకర్ను చికిత్స నిమిత్తం ఆటోలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్కి తరలించారు. కాగా శంకర్ భార్య అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులతో పాటు వారి సమీపం బందువుపై సైతం పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటికీ నిందుతులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శంకర్ హత్యకు అతని సమీప బంధువే రూ. 3లక్షల సుపారీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ హత్యాయత్నం వెనుకు ఎవరున్నారు? ఎలా జరిగింది? మంత్రాల నెపంతోనే దాడికి పాల్పడ్డారా? ఇంకా ఏమైన విషయాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు నిందితులను తమదైన శైలిలో విచారిస్తున్నారు. పూర్తి వివరాలను పోలీసులు ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించి వెల్లడించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.