సిరా న్యూస్,విజయవాడ;
ఏపీలో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. ఈ మేరకు సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత లోక్ సభ ఎన్నికల బరిలో 454 మంది అభ్యర్థులు, 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 46 మంది బరిలో ఉన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం అసెంబ్లీ నుంచి అత్యల్పంగా ఆరుగురు పోటీలో నిలిచినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అసెంబ్లీకి సంబంధించి 318 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలో సీఎం జగన్ సహా 27 మంది బరిలో ఉన్నట్లు ఈసీ తెలిపింది. కుప్పం నుంచి చంద్రబాబు సహా 13 మంది, మంగళగిరిలో నారా లోకేశ్ సహా 40 మంది ఎన్నికల బరిలో నిలిచారు. అటు, పిఠాపురం అసెంబ్లీ బరిలో జనసేనాని పవన్ కల్యాణ్ సహా 13 మంది పోటీ చేస్తున్నారు. ఇక లోక్ సభ ఎన్నికల విషయానికొస్తే మొత్తం 454 మంది అభ్యర్థులు బరిలో నిలవగా కడప లోక్ సభకు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సహా 14 మంది బరిలో నిలిచారు. అలాగే, నంద్యాలలో 31, గుంటూరులో 30 మంది పోటీలో ఉన్నారు. కాగా, ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు మునిగి తేలుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మే 13న పోలింగ్ జరగనుంది.
======================