నల్గోండ డీసీసీబీ కోసం క్యాంపు రాజకీయాలు ..

సిరా న్యూస్,నల్గోండ;
పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల సమరం ముగిసిందో లేదో అపుడే.. నల్లగొండ జిల్లాలో మరో ఎన్నిక రాజకీయాలను వేడెక్కిస్తోంది. నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌పై అవిశ్వాసం వ్యవహారంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. డీసీసీబీ చైర్మన్‌పై అవిశ్వాసం తీర్మానాన్ని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అవిశ్వాసం నెగ్గేందుకు కాంగ్రెస్‌ పార్టీ, వీగిపోయేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే చైర్మన్ పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడు కుంభం శ్రీనివాస్ రెడ్డి 15 మంది డైరెక్టర్లతో క్యాంపు రాజకీయాలకు తెర లేపారు.రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమ అనుచరులకు ముఖ్య పదవులను కట్టబట్టే యోచనలో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్న కాంగ్రెస్.. డీసీసీబీ పీఠంపై కన్నేసింది. ప్రస్తుతం బీఆర్ఎస్ కు చెందిన గొంగిడి మహేందర్‌రెడ్డి నల్లగొండ జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానంతో పదవీ నుంచి దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గా తన అనుచరుడు కుంభం శ్రీనివాస్ రెడ్డిని చేసేందుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చక్రం తిప్పుతున్నారట.డీసీసీబీలో మొత్తం 21 మంది డైరెక్టర్లు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 19 మందే ఉన్నారు. ఇందులో18 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే. మునుగోడు పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్. ఇటీవల డీసీసీబీ వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి చెందిన డైరెక్టర్లలో తుంగతుర్తికి చెందిన గుడిపాటి సైదులు, భువనగిరికి చెందిన అందెం లింగంయాదవ్, నాగార్జునసాగర్ కు చెందిన ఇరిగినేని అంజయ్య, మిర్యాలగూడకు చెందిన బంటు శ్రీనివాస్, కోదాడకు చెందిన వీరస్వామి, కొండా సైదయ్య, నల్లగొండకు చెందిన పాశం సంపత్ రెడ్డిలు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. చైర్మన్‌ మహేందర్‌ రెడ్డి సన్నిహితుడు, యాదగిరిగుట్ట మండలం రామాజీపేటకు చెందిన డీసీసీబీ డైరెక్టర్‌ రాంచందర్‌ బుధవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ బలం మరింతగా పెరిగింది.డీసీసీబీ చైర్మన్ రేసులో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడు కుంభం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. 19 మంది డైరెక్టర్లలో అవిశ్వాస తీర్మానానికి అవసరమైన 14 మంది డైరెక్టర్ల మద్దతు కాంగ్రెస్ కూడగట్టింది. డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ 14 మంది డైరెక్టర్లు ఈ నెల 10వ తేదీన అవిశ్వాసం నోటీసును జిల్లా సహకార అధికారి కిరణ్‌కు అందజేశారు. కో-ఆపరేటివ్ యాక్ట్ ప్రకారం నోటీసు ఇచ్చాక 15 రోజుల సమయం ఇస్తారు. ఈ నెల 28వ తేదీన అవిశ్వాసం తీర్మానంపై ఓటింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గి.. డీసీసీబీ చైర్మన్‌గా కుంభం శ్రీనివాస్ రెడ్డిని చేసేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టుదలతో ఉన్నారు.బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన డైరెక్టర్లను అధికారికంగా కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోవడం ప్రారంభించడంతోపాటు క్యాంపు రాజకీయాలకు హస్తం పార్టీ తెర తీసింది. డీసీసీబీ చైర్మన్‌కు వ్యతిరేకంగా డైరెక్టర్‌ కుంభం శ్రీనివాస్‌రెడ్డి 13 మంది డైరెక్టర్లు, వైస్‌ చైర్మన్‌ దయాకర్‌రెడ్డి మద్దతు కూడగట్టారు. కుంభం శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో 13 మంది డైరెక్టర్లు కర్ణాటకలో క్యాంపునకు తరలి వెళ్లారు. వీరంతా జూన్ 28న జరిగే ఓటింగ్ రోజున రానున్నారు.డీసీసీబీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానాన్ని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రస్తుతం 19 మంది డైరెక్టర్లలో కాంగ్రెస్‌ పార్టీకి వైస్‌ చైర్మన్‌ సహా పది మంది డైరెక్టర్లు ఉన్నారు. మిగితా 9 మంది బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారే. దీంతో కాంగ్రెస్‌ బలం 10కి చేరగా, బీఆర్‌ఎస్‌ బలం 9కి తగ్గింది. అవిశ్వాస తీర్మానం నెగ్గించి, ఎలాగైనా డిసిసిబీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అవిశ్వాసం వీగిపోయేలా చేసేందుకు మహేందర్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. తమ నుంచి వెళ్లిపోయిన ఐదుగురు ఇంకా బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందినవారేనని, అవిశ్వాసం ఓటింగ్‌లో తనకు మద్దతుగా నిలుస్తారని గొంగిడి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌కు 14 మంది డైరెక్టర్ల మద్దతు ఉంటేనే అవిశ్వాసం నెగ్గుతుంది. కాంగ్రెస్‌ వైపు వెళ్లిన వారిలో ఇద్దరిని వెనక్కి లాకుంటే, కాంగ్రెస్‌ బలం 13 అవుతుంది. దాంతో అవిశ్వాసం వీగిపోనుంది. ఆ దిశగా మహేందర్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.అప్పుల్లో ఉన్న డీసీసీబీ బ్యాంకును లాభాల్లోకి తీసుకువచ్చి, బ్యాంకు ప్రతిష్ఠను పెంచానని చైర్మన్ మహేందర్ రెడ్డి చెబుతున్నారు. తన హయాంలో జరిగిన బ్యాంక్ అభివృద్ధి గురించి డైరెక్టర్లందరికీ తెలుసని అన్నారు. కాంగ్రెస్ క్యాంప్ లో ఉన్న డైరెక్టర్లలో సగం మంది తనకు మద్దతు ఇస్తారని, అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.మొత్తం 19 మంది డైరెక్టర్లలో 14 మంది ఛైర్మన్‌కు వ్యతిరేకంగా ఉన్నారని, నైతికంగా ఆయన పదవీలో కొనసాగే అర్హత లేదని చైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్న డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, 14 మంది డైరెక్టర్లు అవిశ్వాసం కోల్పోయిన మహేందర్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఇదిలావుంటే, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి డీసీసీబీ పదవీకాలం ముగియనుంది. కొత్తగా ఏర్పడే పాలకవర్గం ఏడు మాసాలపాటు పదవి కాలం ఉంటుంది. టెస్కాబ్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ లపై అవిశ్వాసానికి కాంగ్రెస్ సిద్ధం కావడంతో చైర్మన్ వైస్ చైర్మన్ పదవులకు రవీందర్ రావు, గొంగిడి మహేందర్ రెడ్డిలు ఇప్పటికే రాజీనామా చేశారు. నల్లగొండ డీసీసీబీ చైర్మన్ అవిశ్వాస తీర్మానం జిల్లాలో ఆసక్తికరంగా మారింది.
================================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *