సిరా న్యూస్,ఆసిఫాబాద్;
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వరద ఉద్ధృతికి పశువులు కొట్టుకుపోయాయి. కాగజ్ నగర్ మండలం అందవెల్లి సమీపంలోని పెద్దవాగుకు శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వరద ప్రవాహం భారీగా పెరిగింది. ఎగువన కురిసిన భారీ వర్షానికి వరద ఉద్ధృతి పెరగ్గా.. పశువులు కొట్టుకుపోయాయి. వాగును దాటే క్రమంలో దాదాపు 50 పశువులు ప్రవాహానికి వాగులో కొట్టుకుపోతూ కనిపించాయి. అయితే, దీన్ని చూసిన పశువులు కాపరి కేకలు వేస్తూ సాయం కోసం అర్థించాడు. అదృష్టవశాత్తు బ్రిడ్జి పిల్లర్ల వద్ద పశువులు ప్రవాహ ఉద్ధృతిని తట్టుకుని ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ తతంగాన్ని స్థానికులు వీడియో తీయడంతో నెట్టింట వైరల్గా మారాయి.మరోవైపు, ఇదే ఆసిఫాబాద్ జిల్లా వరద ప్రవాహంలో చేపల కోసం జనం ఎగబడ్డారు. వాంకిడి మండలం నవేదరి గ్రామ చెరువులో భారీ వర్షానికి వరద ఉద్ధృతి పెరిగింది. ఈ క్రమంలో ప్రవాహంలో చేపలు కొట్టుకుపోతుండగా గ్రామస్థులు అక్కడకి చేరుకుని వలలు, వస్త్రాలతో చేపలు పట్టేందుకు ఎగబడ్డారు. పెద్ద పెద్ద చేపలు చిక్కడంతో హర్షం వ్యక్తం చేశారు.