భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లను సమీక్షించిన అంచనాల కమిటీ చైర్ పర్సన్

సిరా న్యూస్,శ్రీశైలం;

శ్రీశైల దేవస్థానములో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను క్షేత్రములో చేపట్టబడిన అభివృద్ధి కార్యక్రమాలను ఏపి లెజిస్లేటివ్ అసెంబ్లీ అంచనాల కమిటీ (ఎస్టిమెట్స్ కమిటీ) చైర్పర్సన్, పాలకొండ ఎం. ఎల్.ఏ వి. కళావతి ఈ రోజు సమీక్షించారు. స్థానిక భ్రమరాంబా అతిథిగృహంలో జరిగిన ఈ సమావేశంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు,దేవస్థాన పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంచనాల కమిటీ కమిటీ చైర్పర్సన్ మాట్లాడుతూ క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు అవసరమైన సదుపాయాలను ఎటువంటి లోటు లేకుండా కల్పించాలన్నారు. ముఖ్యంగా భక్తులకు వసతి, సౌకర్యవంతమైన దర్శనం తదితర ఏర్పాట్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. ఎప్పటికప్పుడు భక్తుల రద్దీకనుగుణంగా ఆయా ఏర్పాట్లను చేస్తుండాలన్నారు. భక్తులు క్యూలైన్లలో అధికసమయం వేచివుండకుండా దర్శనాలు చేసుకునేందుకు తగు ఏర్పాట్లను చేస్తుండాలన్నారు. అవసరమైన చోట్ల తగినంతగా సూచిన బోర్డులు ఉండాలన్నారు.
భక్తులరద్దీ ఎక్కువగా ఉండే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది మహోత్సవాలు మొదలైన రద్దీ సమయాలలో భక్తులకు తగినంత త్రాగునీరు, వైద్యసేవలు మొదలైనవి అందుబాటులో ఉంచాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ పట్ల కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటుండాలన్నారు.
అదేవిధంగా దేవస్థానంలో భక్తులకు కల్పిస్తున్న ఆయా సౌకర్యాలు,సౌకర్యాల కల్పనలో భాగంగాను మరియు క్షేత్రాభివృద్ధికి చేపట్టబడిన అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.సమావేశంలో కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు దేవస్థానం తరుపున భక్తులకు కల్పించబడుతున్న వసతి సదుపాయాలు, దర్శన ఏర్పాట్లు, అన్నప్రసాదాల వితరణ, వాహనాల పార్కింగు ఏర్పాట్లు, మంచినీటి. సరఫరా, పారిశుద్ధ్యం నిర్వహణ, వైద్యసేవలు, గో సంరక్షణశాల నిర్వహణ, ఆగమపాఠశాల నిర్వహణ మొదలైన వాటి గురించి వివరించారు. సమావేశంలో అసెంబ్లీ అసిస్టెంట్ సెక్రటరి బి. బిక్షం, సెక్షన్ ఆఫీసర్ కాశిరెడ్డి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉమేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.అదేవిధంగా దేవస్థానం సహాయ కమీషనర్ హెచ్. జి. వెంకటేష్, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారులు ఎం. హరిదాసు, జి. మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *