సిరా న్యూస్;
-నేడు ఆయన జయంతి
చండ్ర రాజేశ్వరరావు భారత స్వాతంత్ర్య సమరయోధుడిగా, సామ్యవాదిగా, తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొన్న నాయకుడిగా గుర్తింపు పొందారు. రాజేశ్వరరావు తీరాంధ్ర ప్రాంతపు సంపన్న కమ్మ రైతు కుటుంబంలో జన్మించాడు. 28 సంవత్సరాలకు పైగా భారతీయ కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ.) కి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి 1992లో ఆనారోగ్యకారణాల వల్ల విరమించుకున్నాడు.అంతర్జాతీయ కమ్యూనిస్టు దృక్పథంతో సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలను, శాంతి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళినందుకు రాజేశ్వరరావును `ఆర్డర్ ఆఫ్ లెనిన్’ అవార్డు తో సోవియట్ యూనియన్, `ఆర్డర్ ఆఫ్ డెమిట్రోవ్’ అవార్డుతో బల్గేరియా, అలాగే చెకోస్లోవేకియా, మంగోలియా దేశాలు అవార్డులతో సత్కరించాయి. దేశ సమైక్యతను కాపాడడం కోసం బాబ్రీ మసీదు ను మ్యూజియంగా కాపాడాలని, రాజీ ఫార్ములా ప్రతిపాదించాడు. రాజేశ్వరరావు సంపన్న రైతు కుటుంబం నుండి వచ్చారు. అతను జూన్ 6, 1914 న భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం , కృష్ణా జిల్లా , మంగళపురం గ్రామంలో జన్మించాడు. అతను తన వైద్య విద్యను వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో, విశాఖపట్నంలోని వైద్య కళాశాలలో పొందాడు . అతను 1931లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లో చేరాడు. ఆయన 1954, 1955లో ఆల్-ఇండియా కిసాన్ సభ (రైతుల లీగ్) ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. డిసెంబర్ 1964లో అతను జాతీయ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు.
మానవతా వాది అయిన రాజేశ్వరరావు పార్టీ కార్యాలయాలలో పనిచేసే చిన్న కార్యకర్తలను సైతం ఆప్యాయంగా పలకరించేవాడు. కారుగానీ, కార్యదర్శిగాని లేకుండానే పని నిర్వహించారు ఢిల్లీ లో వేసవిలో ఉష్ణోగ్రత భరించరానంత ఉన్నప్పటికీ కూలర్ కాని, ఎముకలు కొరికే చలి ఉన్నా హీటర్ కానీ వాడలేదు. పార్టీ క్యాంటీన్లో వాలంటీర్లతో కలిసే భోజనం చేసేవాడు. “నాకు ఆస్తిపాస్తులు లేవు. నేను ఎవరికీ ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు. ఎవరి నుంచీ ఏమీ తీసుకోలేదు” అనేవాడు. పంచె కాలిపైకి కట్టి, నెత్తికి తలగుడ్డ చుట్టి గ్రామీణ ప్రజలతో కలిసిపోవడం ఆయన నైజం. గ్రాంథిక భాష వాడడు. ఎదుటివారు తన వైఖరిని, విధానాలను విమర్శించినా చాలా ఓపికతో వినేవాడు. మహిళలు సభలకు హాజరయ్యేందుకు వీలుగా రాత్రి వేళల్లో సమావేశాలు పెట్టవద్దని సూచించేవాడు. హరిజన, గిరిజన, మైనారిటీ వర్గాలపై దాడులు జరిగితే వెంటనే స్పందించి స్వయంగా వెళ్ళేవాడు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఐక్య కార్యాచరణ ముందుకు సాగాలని కోరుకునేవాడు. రాజేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతూ 1994 ఏప్రిల్ 9న మరణించాడు. ఆయన స్మారకార్ధం హైదరాబాదు శివార్లలోని కొండాపూర్లో ఉన్న చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్లో కాంశ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. శ్రీశ్రీ 1947లో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్న చండ్రరాజేశ్వరరావును అనుసరించి ఎన్నికల సభల్లో పాల్గొనేవారు. ఈ సమయంలో చండ్ర రాజేశ్వరరావు నంద్యాల రాజకీయ సభలో శ్రీశ్రీని మొట్టమొదటి సారి మహాకవి అన్నారు, ఆ తర్వాత సాహిత్యలోకంలోనూ, సాధారణ ప్రజల్లోనూ కూడా శ్రీశ్రీకి మహాకవి అన్న బిరుదు స్థిరపడిపోయింది. ఆయన కుమారుడు చంద్ర చంద్రశేఖర్, మనవడు చంద్ర జైదీప్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఉన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తి కోసం అలుపెరగని పోరాటం సాగించిన రాజేశ్వరరావు ఆ ఉద్యమ ధ్రువతారగా చిరస్మరణీయులు.
================