చంద్రబాబు విజనరీ నాయకుడు

– ఏపీ అభివృద్ధికి తీవ్రంగా కృషిచేశారు: గవర్నర్
సిరా న్యూస్,అమరావతి;
విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. శాసనసభ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసగించారు. రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రకు నష్టం వాటిల్లిందని, అలాంటి స్థితిలో అన్ని రంగాల అభివృద్ధికి చంద్రబాబు తీవ్రంగా కృషి చేశారని గుర్తుచేశారు.
2014 నుంచి 2019 వరకు రాష్ట్రానికి పెట్టుబడుల వరద కొనసాగిందన్నారు. రాజధాని నిర్మాణానికి అపూర్వ కృషి సాగిందని, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు దెబ్బతిన్నాయని గవర్నర్ పేర్కొన్నారు.

విభజన వల్ల ఆంధ్రప్రదేశ్కు నష్టం ఏర్పడిందని, ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ పేర్కొన్నారు. శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు ధన్యవాదాలు, కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు విజనరీ నాయకుడు
చంద్రబాబు విజనరీ నాయకుడు అని, 2014లో ఏపీ అభివృద్ధికి ఆయన తీవ్రంగా కృషిచేశారని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగిందన్నారు. అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయని, రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ఎంతో కృషిచేశారని కొనియాడారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని రంగాలు నష్టాలు చవిచూశాయన్నారు. చంద్రబాబు హయాంలో వచ్చిన పెట్టుబడిదారులు వెనక్కి మళ్లారని తెలిపారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిందని పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అశాస్త్రీయంగా విడదీశారు

ఎన్నికల ప్రక్రియలో ప్రజలు చురుగ్గా పాల్గొన్నారని, మార్పు కావాలని ప్రజలు ఆకాంక్షించారన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత సభ్యులపై ఉందని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అశాస్త్రీయంగా విడదీశారన్న గవర్నర్, భాగస్వాములతో చర్చలు చేయకుండా విభజించారన్నారు. ఉమ్మడి ఏపీ విభజన రాష్ట్ర ప్రజల హృదయాల్లో మాయని మచ్చగా మిగిలిందని తెలిపారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ వల్ల అల్లకల్లోలం ఏర్పడిందన్న గవర్నర్, రాష్ట్ర ప్రజలు సుదీర్ఘకాలం అభివృద్ధి పురోగతికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తగినంత పరిహారం ఇవ్వలేదన్న గవర్నర్, ఆస్తులు, అప్పుల పంపిణీలో అసమానతలు ఉన్నాయన్నారు. అశాస్త్రీయ విభజన వల్ల 46 శాతం వనరులు మాత్రమే వారసత్వంగా వచ్చాయని, రాజధాని హైదరాబాద్ను కోల్పోవడం వల్ల ఆర్థిక నష్టం జరిగిందని చెప్పారు. ఉన్నత విద్యాసంస్థలు కోల్పోయామన్న గవర్నర్, భారీ రెవెన్యూ లోటు వారసత్వంగా వచ్చిందని తెలిపారు. ప్రాంతం ఆధారంగా ఆస్తులు, వినియోగం ఆధారంగా విద్యుత్ పంపిణీ చేశారని, ఎలాంటి ఆధారాలు లేకుండా విద్యాసంస్థలు విభజించారన్నారు.

సన్రైజ్ ఏపీకి చంద్రబాబు ప్రభుత్వం పునాది వేసింది
ఉమ్మడి ఏపీలో తలసరి ఆదాయం లక్షా 6 వేల 176 కోట్లు ఉండేదని, విభజిత ఏపీలో తలసరి ఆదాయం 93 వేల 121 కోట్లకు పడిపోయిందని ఆవేదన వెలిబుచ్చారు. రాష్ట్ర విభజన వల్ల ప్రతికూల ప్రభావం పడిందన్న గవర్నర్, అపరిష్కృత సమస్యల వల్ల సవాళ్లు వచ్చాయన్నారు. విభజన వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని చంద్రబాబు ప్రభుత్వం అవకాశంగా మలచుకుందని, సన్రైజ్ ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు ప్రభుత్వం పునాది వేసిందని కొనియాడారు. సముద్ర తీరం, నౌకాశ్రయ ఆధారిత అభివృద్ధిపై, తయారీ కార్యకలాపాలకు అవసరమైన వాతావరణంపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించిందని స్పష్టం చేశారు.

2014-19 మధ్య కాలంలో అభివృద్ధి, సంక్షేమం మధ్య స్పష్టమైన సమతుల్యం ఉందన్న, గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో పట్టిసీమ రికార్డు సమయంలో పూర్తయిందని తెలిపారు. ఏడాది సమయంలోనే చంద్రబాబు ప్రభుత్వం పట్టిసీమ పూర్తిచేసిందని, చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తయిందని గుర్తు చేశారు. ఇతర నీటిపారుదల ప్రాజెక్టులకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారన్న గవర్నర్, కరవు నివారణ చర్యలు, రియల్టైమ్ గవర్నెన్స్ చేపట్టారని పేర్కొన్నారు. భూసేకరణ ద్వారా అమరావతి ప్రాంత అభివృద్ధి చేశారని, కొత్త సచివాలయం, శాసనసభ భవన నిర్మాణం చేశారని తెలిపారు. చంద్రబాబు దూరదృష్టి నాయకత్వం వల్లే 2014-19 మధ్య అభివృద్ధి సాధ్యమైందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *