సిరా న్యూస్,ఏలూరు;
రఘురామకృష్ణం రాజు ఎటూ కాకుండా పోయారు. ఆయనకు కూటమిలో ఏ పార్టీ టికెట్ ప్రకటించలేదు. బిజెపి టిక్కెట్ వస్తుందని భావించిన రఘురామకృష్ణం రాజు.. టిడిపి, జనసేనలో చేరలేదు. చివరకు బిజెపి అంతర్గత రాజకీయానికి రఘురామకృష్ణంరాజు బలి అయ్యారు. ఆయన బిజెపి నుంచి నరసాపురం ఎంపీ సీటును ఆశించారు. కానీ బిజెపి అనూహ్యంగా భూపతి రాజు శ్రీనివాస వర్మను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే తెర వెనుక జగన్ ఈ విషయంలో చక్రం తిప్పారని.. బిజెపిలోని ప్రో వైసిపి నేతలతో రఘురామకృష్ణంరాజు కు టికెట్ రాకుండా చేశారని తెలుస్తోంది. అయితే రఘురామకృష్ణంరాజుకు టికెట్ రాలేదంటే.. అది జగన్ విజయం అవుతుందని.. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు టిక్కెట్ ఇవ్వాలని టిడిపి తో పాటు జనసేన భావిస్తోంది. ఆ రెండు పార్టీల్లో అభిప్రాయం ఉంది కనుకే.. ఈ ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని రఘురామకృష్ణంరాజు పదే పదే చెబుతున్నారు.చంద్రబాబు ప్రజాగళం ప్రచార కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఎన్నికల వ్యూహరచనలో ఉన్నారు. పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన చోట అసంతృప్త వాదులను పిలిచి మాట్లాడుతున్నారు. అదే సమయంలో కూటమిలో అభ్యర్థులను సైతం సర్దుబాటు చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా బీజేపీ, టిడిపి పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో చేర్పులు మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా రఘురామకృష్ణం రాజు కోసం చంద్రబాబు బిజెపికి కీలక ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది.నరసాపురం పార్లమెంటు స్థానాన్ని టిడిపికి విడిచిపెట్టి.. ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని బిజెపికి తీసుకోవాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. దీనిపైనే ఇప్పుడు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.వాస్తవానికి బిజెపి నుంచి నరసాపురం ఎంపీ సీటు తనకు వస్తుందని రఘురామకృష్ణంరాజు ధీమాగా ఉండిపోయారు. అయితే ఆ పార్టీలో అంతర్గతంగా జరిగిన పరిణామాలతో రఘురామకృష్ణం రాజుకు బిజెపి టికెట్ దక్కలేదు. అటు టిడిపి, జనసేన జాబితాలో సైతం రఘురామ పేరు లేదు. దీంతో వైసీపీ సంబరాలు చేసుకుంది. రఘురామకృష్ణం రాజుకు తగిన శాస్తి జరిగిందని సోషల్ మీడియాలో ట్రోల్ చేసింది. అయితే రఘురామ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుంటే జగన్ దే పై చేయి అవుతుందని చంద్రబాబు భావించారు. అందుకే రఘురామకృష్ణం రాజుకు సొంత నియోజకవర్గం నరసాపురం నుంచి టికెట్ దక్కేలా ప్రయత్నాలు ప్రారంభించారు.పొత్తుల్లో భాగంగా ఏలూరు నుంచి టిడిపి అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. నరసాపురం బిజెపికి కేటాయించడంతో ఆ పార్టీ అభ్యర్థిగా భూపతి రాజు శ్రీనివాస్ వర్మ పేరును ప్రకటించారు. పుట్టా మహేష్ యాదవ్ యనమల రామకృష్ణుడు అల్లుడు. ఈసారి యనమల కుటుంబం నుంచి నలుగురికి టికెట్లు దక్కాయి. టిడిపిలో ఇది విమర్శలకు కారణం అవుతుంది. అందుకే చంద్రబాబు ఒక ఆలోచనకు వచ్చారు. నరసాపురం ఎంపీ సీటును టిడిపికి వదిలితే.. ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని బిజెపికి విడిచిపెడతామని చంద్రబాబు ప్రతిపాదన పెట్టారు. వాస్తవానికి నరసాపురం టికెట్ రఘురామకృష్ణం రాజుకు బిజెపి ఖరారు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అయితే గత నాలుగున్నర సంవత్సరాలుగా వైసిపి పై పోరాటం చేయడంలో రఘురామ ముందంజలో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో పాటు టిడిపి, జనసేన లతో సన్నిహితంగా మెలిగారు.అటువంటి నాయకుడికి టిక్కెట్ ఇవ్వకపోతే.. జగన్కు బలంగా మారుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే నరసాపురం ఎంపీ స్థానాన్ని టిడిపికి ఇచ్చేలా.. రఘురామను పోటీ చేయించేలా పావులు కదుపుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి