Collector Abhilash Abhinav: ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

సిరాన్యూస్,నిర్మ‌ల్‌
ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలి : కలెక్టర్ అభిలాష అభినవ్
* నర్సాపూర్ ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి త‌నిఖీ

ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం నిర్మ‌ల్ జిల్లా నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆసుపత్రిలోని ఇన్ పేషెంట్, బయటి రోగుల విభాగం, మందుల గది టీకాల గదిలో సంబంధిత రిజిస్టర్ లను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సౌకర్యాలు అందిస్తున్న చికిత్సలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. వైద్యం కోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వైద్య చికిత్సలను అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికీ అసౌకర్యం కలగకుండా అవసరమైన బెడ్స్, మందులు ఇతర వైద్య పరికరాలు నిరంతరం అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలనను కచ్చితంగా పాటించాలని, విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సమన్వయం చేసుకుంటూ ప్రసవాల సంఖ్యను పెంచాలన్నారు. సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచేందుకు అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ఆస్పత్రిలో టీవీని ఏర్పాటు చేసి పౌష్టికాహారం పరిశుభ్రత గర్భిణీల ఆరోగ్యం తదితర అంశాలపై అవగాహన కల్పించే విధంగా వీడియోలను ప్రదర్శించాలన్నారు. ఆసుపత్రి పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎం ఎచ్ ఎన్ నోడల్ అధికారి డా. సౌమ్య, వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *