సిరాన్యూస్, ఆదిలాబాద్
పరిశుభ్రత పాటించాలి : కలెక్టర్ రాజర్షి షా
* గ్రామంలోని సమస్యపై ఆరా
* తంతోలిలో విస్తృత పర్యటన
ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ రూరల్లోని తంతొలి గ్రామ పంచాయితీ కార్యాలయంలో చౌక ధరల దుకాణాన్నికలెక్టర్ పరిశీలించారు. అనంతరం ప్రాథమికోన్నత పాఠశాల, అంగన్వాడి కేంద్రం, గ్రామాల్లో ఉన్న సమస్యల పై ఆరాతీశారు.ఈ సందర్భంగా రేషన్ షాపులో నిల్వ ఉన్న బియ్యం బస్తాలను ఎన్ని ఉన్నాయి.. ఎంత స్టాక్ వచ్చింది.. ఓపినింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ వివరాలను, బియ్యం నాణ్యతను రేషన్ డీలర్ ను అడిగి తెలుసుకున్నారు. షాప్ ను పరిశుభ్రంగా ఉంచాలని, ఎక్కడపడితే అక్కడ చెత్త చెదారం లేకుండా శుభ్రత పాటించాలని ఆదేశించారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం లో ఋణం పొంది కిరణా షాప్ ద్వారా ఉపాధి పొందుతున్న మహిళను వ్యాపారం ఎలా నడుస్తుందని, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి కమ్యూనిటీ సోఫ్ కిట్ ఏర్పాటు చేయాలని , మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు రోజులకొకసారి శుభ్రం చేయించాలని, తనిఖీ రిజిష్టర్ మెయింటెన్ చేయాలని, ఎంతమంది విద్యార్ధులకు వంట చేస్తున్నారు, మెనూ ప్రకారం అందిస్తున్నారా , ఒక విద్యార్థికి అందించాల్సిన గ్రాముల ప్రకారం వంట చేయాలని , ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డిని ఆదేశించారు. విద్యార్ధులతో ముచ్చటిస్తూ పాఠాలను చదివించారు. విద్యార్ధులకు కోడి గ్రుడ్లు ఎన్ని రోజులు ఇస్తున్నారని ఆరా తీయగా వారం లో మూడు రోజులు ఇస్తున్నామని తెలిపారు. మధ్యాహ్నం భోజనం, పారిశుద్ధ్య పనుల తీరును పరిశీలించి, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. తదుపరి అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి బియ్యం, తదితర సరుకులను పరిశీలించి వండిన అన్నం రుచి ఎలా ఉందో తిని చూశారు. చిన్నారుల బరువు, ఎత్తును తూచే తీరును పరిశీలించి కొలతలతో ఎలాంటి తేడా రాకుండా సరిగా కొలవాలని అంగన్వాడి టీచర్ ను ఆదేశించారు. గ్రామస్తులు గ్రామ సమస్యలను జిల్లా పాలనాధికారి కి విన్నవిస్తు పైప్ లైన్ లీకేజి అవుతున్నదని, విద్యుత్ తీగలు సరిచేయాలని, అంగన్వాడి భవనం నిర్మించాలని కోరగా సానుకూలంగా స్పందించి పైప్ లైన్ లీకేజి నీ వెంటనే సారి చేయాలని పంచాయితీ సెక్రటరీ సాయి కుమార్ ను ఆదేశించారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న ఇంటింటి ఫీవర్ సర్వే ఎంతవరకు చేశారని ఏఎన్ఎం , ఆశావర్కర్లు ను అడిగి తెలుసుకొని, జ్వరం ఉన్న వారికి రక్త పరీక్షలు చేయాలని ఆదేశించారు.