జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
సిరా న్యూస్,నంద్యాల;
జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, పరిశ్రమలు ఇతర భూసేకరణకు సంబంధించి ప్రతిపాదనలు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. .కలెక్టర్ ఛాంబర్ లో పెండింగ్ లో ఉన్న భూసేకరణపై జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ తో కలిసి రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. డిఆర్ఓ ఏ పద్మజ, ఆర్డీవోలు మల్లికార్జున రెడ్డి, ఎం దాసు, మహేశ్వర్ రెడ్డిలు, ఆర్ అండ్ బి ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, నేషనల్ హైవే పిడి గోవర్ధన్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ 340 సి ప్యాకేజీ 4 కింద జూపాడుబంగ్లా, పాములపాడు, నందికొట్కూరు, ఆత్మకూరు మండలాలు మీదుగా వెళ్లే రహదారి భూసేకరణకు సంబంధించి 75.47 ఎకరాలు పెండింగ్లో ఉందని… ఇందుకు సంబంధించి తాసిల్దారుల నుండి క్లెయిమ్స్ తెప్పించుకొని నిశితంగా పరిశీలించి ప్రతిపాదనలు పంపవాలని ఆర్డిఓలను ఆదేశించారు. 167 కె ఒకటవ ప్యాకేజీ క్రింద (నంద్యాల నుండి జమ్మలమడుగు వరకు) నంద్యాల, గోస్పాడు, దొర్నిపాడు, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ, సంజామల మండలాల మీదుగా వెళ్లే రహదారి సంబంధించి పెండింగ్ లో ఉన్న అవార్డ్స్ ను త్వరితగతిన పాస్ చేయాల్సిందిగా నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. 167 కె ప్యాకేజ్ 4 కింద 5 మండలాలు 22 గ్రామాలకు చెందిన 177 ఎకరాల క్లెయిమ్స్ పెండింగ్లో ఉన్నాయని ఇందుకు సంబంధించి తాసిల్దారుల నుండి నివేదికలు తెప్పించుకొని సమర్పించాలని ఆర్డీవోలను ఆదేశించారు. 167 కె ప్యాకేజీ – 5 కింద నల్లకాలువ నుండి వెలుగోడు వరకు 3ఎ ప్రతిపాదనలను ఏపీఆర్డిసి కార్య నిర్వహణ అధికారి నుండి ప్రతిపాదనలు తెప్పించుకోవాలని భూసేకరణ అధికారులను ఆదేశించారు. రోడ్లు భవనములు సంబంధించి రహదారుల విస్తరణ, రైల్వే ప్రాజెక్టులు, సిమెంట్ పరిశ్రమలు, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, చుక్కల భూములు, అన్యాక్రాంత భూములు తదితరాలకు సంబంధించిన ప్రతిపాదనలు, నివేదికలను త్వరితగతిన పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులు, ఆర్డీవోలను ఆదేశించారు.