ఎల్లంపల్లిలో నీళ్లున్నా పంటలు ఎండబెడ్తున్న కాంగ్రెస్‌

-యాసంగికి నీళ్లు ఇస్తమని మభ్యపెట్టి మోసం చేసిండ్లు

-ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలే
-ప్రాజెక్టుల గేట్లు తెరిచి రైతులను ఆదుకోవాలే

-పార్టీ మారెటోళ్లు రైతుల గురించి ఆలోచన చేయాలే

-జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

సిరా న్యూస్,మంథని;
ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల్లో నీళ్లున్నా ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించకుండా పంటలు ఎండబెడుతున్న ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వం, స్థానిక పాలకులకే దక్కుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు.
శనివారం మంథని మండలం సూరయ్యపల్లి గ్రామ శివారులో ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు.
ఈసందర్బంగా పుట్ట మధు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల నీళ్లు తరలించుకుపోతున్నారని, స్థానిక రైతులకు చుక్క నీళ్లు ఇవ్వడం లేదని అప్పటి ప్రభుత్వాన్ని బదానం చేసిన కాంగ్రెస్‌ నాయకులు, పాలకులు ఈనాడు వాళ్ల ప్రభుత్వంలో నీళ్ల వాటాను ఎందికస్తలేరని ఆయన ప్రశ్నించారు. వర్షాకాలంలో పంటలు సాగు చేసిన రైతులకు యాసంగి పంటకు అవసరమైన సాగునీరు అందిస్తామని ప్రకటనలు చేశారని, స్థానిక నాయకులు తమ నాయకుడు అధికారులతో మాట్లాడాడని, ఇక నీళ్లు వస్తాయని ప్రచారం చేయడంతో రైతులు గంపెడంత ఆశతో పంటలు సాగుచేసుకున్నారని అన్నారు. తీరా సమయానికి ఒక్క చుక్క నీళ్ల అందించడం లేదని, నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే రైతులు ఆగమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక సాగునీటి ఇబ్బందులు ఉండవని చెప్పిన నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత యాసంగికి నీళ్లు ఇవ్వకుండా రైతులను మోసం చేశారని ఆయన విమర్శించారు. ఇటీవల కురిసిన వడగండ్ల వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహరం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినట్లుగానే నీళ్లు రాక పంటలు ఎండిన రైతులకు సైతం నష్టపరిహరం అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు నీళ్ల కోసం రోడ్డు ఎక్కిన చరిత్ర లేదని, చివరి ఆయకట్టుకు నీళ్లు అందించి పంటలను కాపాడిన చరిత్ర మాదేనని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గెట్లు తెరిచామని, ఎవరైనా పార్టీలోకి చేరవచ్చని ప్రకటనలు చేస్తున్న పాలకులు రైతులకు భరోసా కల్పించేలా ప్రాజెక్టుల గేట్లు తెరువాలని ఆయన హితవు పలికారు. పార్టీ గెట్లు తెరిచే బదులు ప్రాజెక్టుల గేట్లు తెరిస్తే రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రైతులకు అన్యాయం చేసిన కాంగ్రెస్‌ పార్టీలోకి చేరేందుకు ముందుకు వస్తున్న నాయకులు రైతుల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. అధికారం కోసం పదవుల కోసం ఆరాటపడవద్దని, రైతులకు సాగునీరు అందించడానికి కృషి చేయాలన్నారు. ఆనాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో రైతులకు పెట్టుబడి సాయం, నీళ్లు ఇచ్చి ఆదుకున్నాడని, ఈనాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఎం ఇచ్చిందని, ఏం పని చేస్తుందని చెప్పుకోలేనిపరిస్థితి ఉందని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఈ ప్రాంత పాలకులు, ప్రభుత్వం రైతుల గురించి ఆలోచన చేయాలని, ఎండిన పంటలకు నష్టపరిహరం అందించి ఆదుకోవాలని ఆయన ఈ సందర్బంగా డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *