ఎదురు తిరుగుతున్న వ్యూహం

సిరా న్యూస్,తిరుమల;
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద కల్తీ విషయంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ వ్యూహం మార్చారు. ఇప్పటి వరకూ నిజాలు తెలుసుకోవాలని ఆయన చాలా మందికి లేఖలు రాశారు. పార్టీ పరంగా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. కానీ లడ్డూ లో కల్తీ జరగనే లేదు అన్న వాదన మాత్రం గట్టిగా వినిపిస్తున్నారు. అందు కోసం రకరకాల వాదనలతో తెరపైకి వస్తున్నారు. తాజాగా జగన్ స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించారు. తిరుమలకు కాలి నడకన వెళ్లడంతో పాటు శనివారం ఆలయాల్లో పూజలు చేయాలని పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు.తిరుమల లడ్డూ ఇష్యూలో జగన్ అన్యమతస్తుడు కాబట్టే హిందూ సంప్రదాయాలు, సనాతన ధర్మం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారని పైగా కించ పరుస్తున్నారని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ విషయంలో ఎదురుదాడికి వైసీపీ వ్యూహం సిద్ధం చేసుకుంది. చాలా రోజులుగా బయటకు రాని కొడాలి నాని వంటి వారితోనూ ప్రెస్‌మీట్లు పెట్టారు. కల్తీ నెయ్యితో వచ్చిన ట్యాంకర్లను వెనక్కి పంపించామని కల్తీ జరగనే లేదని వాదించారు. అందరూ ఇదే వాదనతో తెరపైకి వస్తున్నారు. శనివారం ఆలయాల్లో పూజలు.. ఆ తర్వాత జగన్ తిరుమల పర్యటన తర్వాత మరంత అగ్రెసివ్ గా కల్తీ జరగలేదన్న వాదనను వినిపించాలనుకుంటున్నారు. మరోవైపు లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీకి కాంట్రాక్ట్ ఇవ్వడానికి అనేక రూల్స్ మార్చారని తేలింది. కనీస అర్హత లేకపోయినా.. రూల్స్ మార్చి ఏఆర్ డెయిరీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. అలాగే ఆ డెయిరీ నెయ్యి కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన పరక్షల్లోనూ కల్తీగా తేలింది. వీటన్నింటిపై ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఆ సిట్ నివేదికలో అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. అసలు నెయ్యి టెండర్ల వెనుక ఉన్నగోల్ మాల్.. ఆయా సంస్థలు నెయ్యిని ఎలా ప్రొక్యూర్ చేస్తాయి.. అసలు తిరుమలలో టెస్టింగ్ చేశారా లేదా అంటి విషయాలు అన్నీ వెలుగులోకి వస్తాయి. ఇవన్నీ తమకు ఇబ్బందికరంగా ఉంటాయని వైసీపీ గట్టిగా నమ్ముతోంది. అందుకే ఆ సిట్ ..చంద్రబాబు చెప్పిందే చెబుతుందని ముందుగానే ఖండిస్తున్నారు.కానీ దర్యాప్తు సంస్థలు చెప్పేదే ఫైనల్. వైసీపీ హయాంలో తిరుమలలో లెక్కలేనన్ని అవకతవకలు జరిగాయని ఇప్పటికే లీకులు వచ్చాయి. ఒక్క టీటీడీ చైర్మనే సగటున రోజుకు ఐదు వందల వరకూ వీఐపీ దర్శన టిక్కెట్లు కేటాయించారని.. నాలుగేళ్లలో మూడున్నర లక్షల మందికి దర్శన టిక్కెట్లు ఇచ్చారని అవన్నీ అమ్ముకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పెద్దిరెడ్డి, రోజా ట్రావెల్స్ పేరుతో టిక్కెట్లు అమ్ముకున్నారు. అలాగే ఇతర వైసీపీ నేతలు కూడా అదే పని చేశారని అంటున్నారు. ఇక ఎన్నికలకు ముందు తిరుపతిలో పనులకు టీటీడీ నిధులు మళ్లించడం సహా అనేక అవకతవకలు బయటకు వచ్చాయని వాటన్నింటినీ ప్రభుత్వం టైం చూసి బయట పెడుతుందని అంటున్నారు.తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ వాదనను అంత బలంగా వెళ్లడం లేదు. అందుకే ఎదురుదాడి చేస్తున్నారు. దానికి టీడీపీ .. తిరుమలలో అక్రమాల డాక్యుమెంట్లను రిలీజ్ చేస్తూ కౌంటర్ ఇస్తుంది. ఈ రాజకీయం మరింత రసవత్తరంగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *