సిరా న్యూస్;మంగళగిరి;
అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పనులు ప్రారంభిస్తాం
బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో యువనేత నారా లోకేష్
అప్పులతో కాకుండా అభివృద్ధి చేసి రాష్ట్ర ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నది తెలుగుదేశం పార్టీ విధానమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు మిడ్ వ్యాలీ సిటీలో బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ అనే కార్యక్రమంతో యువనేత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… 2014లో చంద్రబాబునాయుడు సున్నాతో పాలన ప్రారంభించారని, గత అయిదేళ్లలో జగన్ విధ్వంస పాలన కారణంగా 30ఏళ్లు వెనక్కివెళ్లిందని చెప్పారు. అయినప్పటికీ రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సమగ్ర ప్రణాళిక తమ వద్ద ఉందని తెలిపారు. పరిశ్రమలు రప్పించడం ద్వారా లక్షల ఉద్యోగాలు కల్పిస్తే రాష్ట్ర ఆదాయం రెట్టింపు అవుతుందని, చంద్రబాబు గారి ఆలోచనల మేరకు 20లక్షలు ఉద్యోగాలు కల్పించడం ద్వారా రెండున్నర రెట్లు పెరుగుతుందని చెప్పారు. ఆదాయం పెంపుదల ద్వారా ఇప్పటికంటే మెరుగైన సంక్షేమాన్ని ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి విద్యావంతులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. జగన్ మూడు ముక్కలాటతో తీవ్రంగా నష్టపోయాం. అటు విశాఖ, ఇటు అమరావతి, కర్నూలు ఏదీ అభివృద్ధి చెందలేదు. రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ కంటే దారుణంగా తయారయ్యాయి.