సిరా న్యూస్, గొల్లప్రోలు:
మిచౌంగ్ తుఫాన్ సృష్టించిన బీభత్సానికి పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలోని పలు గ్రామాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మండలంలోని తాటిపర్తి, మల్లవరం, చెందుర్తి , కొడవలి తదితర గ్రామాల్లో అరటి, పత్తి పంటలు నేల కొరిగాయి. గత రెండు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు వర్షపునీరు అధికమొత్తంలో పొలాల్లోకి చేరడంతో పంటలు నీట మునిగాయి. వర్షాలు మరో రెండు రోజులు ఇలాగే కొనసాగితే వరి పంటకు సైతం తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సర్వే నిర్వహించడంతో పాటు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.