సిరాన్యూస్, ఆదిలాబాద్
బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలి: డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి
మాజీ మంత్రి జోగు రామన్న పూర్తి జాతకం తనకు తెలుసునని ,తనపై లేని పోని ఆరోపణలు చేయిస్తే జోగు బండారం ఎపిసోడ్ల వారీగా బయట పెడతానని డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ విషయంలో బీఆర్ ఎస్ నేతల వ్యాఖ్యలను ఖండించారు. గత మీ ప్రభుత్వం కంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేస్తుందన్నారు. సాంకేతిక లోపాల వల్ల ఇంకా నలభై శాతం రుణ మాఫీ జరగలేదని, ఇందుకోసం ఓ ప్రత్యేక సిస్టం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.అనవసరంగా రైతులను రెచ్చగొట్టే పనులు మానుకోవాలని అన్నారు. ఇదంతా మాజీమంత్రి జోగు రామన్న కనుసన్నల్లో జరుగుతందని, తాను గతంలో ఇలాగే ముఫ్పై ఏళ్లు ఆయన చెప్పింది చేస్తూ మాట్లాడమన్నది మాట్లాడి రోడ్డు పై కొచ్చానాని, నీకు అలాంటి గతే పడుతుందని తనను విమర్శించిన నాయకుడు లింగారెడ్డి కి సూచించారు. డీసీసీబీ ఛైర్మన్ గా ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్న తనపై వ్యక్తిగత దూషణలు చేయిస్తున్నాడని ఆరోపించారు. ఇవన్నీ మానుకోక పోతే బండారం బయట పెడతానన్నారు.జోగు రామన్న ఇప్పటికైనా తన అనుయాయుల చేత తప్పుడు మాటలు మాట్లాడిస్తే అందరి జాతకం విప్పుతానన్నారు. ప్రజలు ఓడించినా ఇంకా మాజీ మంత్రి కళ్లు తెరవడం లేదన్నారు. మా జోలికొస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. సమావేశం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,తుమ్మల వెంకట్ రెడ్డి,కౌన్సిలర్లు ఆవుల వెంకన్న,సంద నర్సింగ్, జాఫర్ అహ్మద్,మున్సిపల్ కో.ఆప్షన్ మెంబర్ ఇజ్జగిరి సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.