సిరా న్యూస్;
-నేడు ఆయన వర్ధంతి
బాబా ఆమ్టే అతని అసలు పేరు మురళీధర్ దేవదాస్ ఆమ్టే. ప్రముఖ సంఘసేవకుడిగా ప్రసిద్ధిగాంచిన బాబా ఆమ్టే ముఖ్యంగా కుష్టు రోగుల పాలిట దేవుడిగా మారినాడు.
డిసెంబర్ 26, 1914లో మహారాష్ట్రలోని వార్థా జిల్లా హింగన్ఘాట్లో ఒక ఉన్నత దేశస్థ బ్రాహ్మణ జాగిర్దార్ కుటుంబంలో జన్మించాడు. అతని అసలు పేరు మురళీధర్ దేవదాస్ అమ్టే కాగా చిన్నతనంలోనే అతన్ని బాబా అని పిలిచేవారు. బాబా అనేది ఎవరో ప్రధానం చేసిన బిరుదు కాదు అది తల్లిదండ్రులు పెట్టిన ముద్దుపేరు. న్యాయశాస్త్రంలో శిక్షణ పొందిన తరువాత వార్థాలో న్యాయ అభ్యాసం ప్రారంభించాడు. అదే సమయంలో భారత జాతీయోద్యమ పోరాటం జరుగుతుండేది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అరెస్ట్ కాబడిన జాతీయ నేతల తరఫున కోర్టులలో వాదించేవాడు. క్రమక్రమంగా మహాత్మా గాంధీ వైపు ఆకర్షితుడైనాడు. గాంధీజీతో పాటు కొంత కాలం సేవాగ్రం ఆశ్రమంలో గడిపినాడు. ఆ తరువాత జీవితాంతం వరకు గాంధీజీ సిద్ధాంతాలకే కట్టుబడినాడు. వేషధారణలో కూడా గాంధీజీ వలె ఖద్దరు దుస్తులనే వాడేవాడు. గాంధీజీ వలె జీవితాంతం అణగారిన వర్గాల కృషికై పాటుపడ్డాడు.
సమాజంలోని రుగ్మతలు, పేదల దీన స్ధితికి చలించే ఆయన తన జీవితాన్ని కుష్టు రోగుల సేవలకు, వారి పునరావాసానికి కృషి చేశారు. పర్యావర్ణ పరిరక్షణకూ, అడవులు పెంపకానికి ఆయన కృషి చేశారు.
కుష్టురోగుల సేవలకై చంద్రాపూర్ జిల్లాలో ఆనంద్వన్ ఆశ్రమాన్ని స్థాపించి అతను కూడా వారితోపాటే అక్కడే జీవితాన్ని గడిపి 2008, ఫిబ్రవరి 9న తన ఆశ్రమంలోనే మృతి చెందిన మహనీయుడు. ఉన్నత కుటుంబంలో జన్మించి భోగభాగ్యాలను వదిలి అణగారిన వర్గాల మేలు కొరకై జీవితాంతం కృషిసల్పిన అతని కృషి మరవలేనిది.
బాబా ఆమ్టే సేవలకు గుర్తింపుగా అనేక అంతర్జాతీయ, జాతీయ అవార్డులు వచ్చాయి. రామన్ మెగసేసే అవార్డు, జాతీయ పద్మ అవార్డులు ఆయనను వరించాయి.