సిరా న్యూస్, జైనథ్:
దీపాయిగూడ రామాలయంలో ప్రత్యేక పూజలు…
– నాలుగు రోజులుగా కొనసాగుతున్న శోభాయాత్రలు, భజనలు
– సోమవారం కళ్యాణోత్సవ నిర్వహణకు సర్వం సిద్ధం
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామంలోని రామాలయంలో గత నాలుగు రోజులుగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయోధ్య రామాలయంలో సోమవారం రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా, దీపాయిగూడ గ్రామంలో ప్రతిరోజు ఉదయం శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. రాములోరి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ప్రతిష్టించి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రామాలయంలో పెద్ద ఎత్తున భజనలు, హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టినట్లు భక్తులు తెలిపారు.
సోమవారం కళ్యాణోత్సవం…
గ్రామంలోని రామాలయంలో సోమవారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో అభిషేకం, హోమం ఇత్యాది పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తుల కోసం మహాన్నదానం సైతం ఏర్పాటు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసి, రాములోరి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నారు.