సిరా న్యూస్, ఆదిలాబాద్:
భక్తులతో కిటకిటలాడిన దీపాయిగూడ రామాలయం…
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని దీపాయిగూడ రామాలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. అయోధ్య రామాలయంలో రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా, దీపాయిగూడ రామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామి వారి ఉత్సవ విగ్రహాలన బంతిపూలతో అలంకరించిన పల్లకిలో ప్రతిష్ఠించి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయంలో రామనామ పారాయణం గావించారు. ఆలయావరణలో హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. సతీసమేతుడైన రాములోరికి నూతన వస్త్రాలను అలంకరించి, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అలయంలో భక్తుల కోసం ప్రత్యేకంగా ప్రొజెక్టర్ తెర ఏర్పాటు చేయడంతో, అయోధ్య రామాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ పూజాది కార్యక్రమాలను భక్తులు లైవ్లో వీక్షించారు. అనంతరం మహాన్నదానం గావించారు. సాయంత్రం భక్తుల దర్శనార్థం స్వామి వారి విగ్రహాలతో గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. దీంతో గ్రామం జై శ్రీరాం నినాదంతో మార్మోగింది.