Demand for New Pattas: సదల్ పూర్ లో కోలాం గిరిజనుల ఆందోళన

సిరా న్యూస్, బేల:

సదల్ పూర్ లో నూతన పట్టాల కోసం కోలాం గిరిజనుల ఆందోళన

ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్ పూర్ గ్రామంలో కొలాం గిరిజనులు నూతన పట్టాల కోసం ఆందోళన చేశారు. బుధవారం కొలాం హక్కుల పోరాట సమితి బేల మండల అధ్యక్షుడు మడావి జంగు ఆధ్వర్యంలో 25 మంది కొలాం గిరిజన కుటుంబాల సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలుగా తాము సాగు చేస్తున్న భూములకు నూతన పట్టాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పలు మార్లు ఈ విషయం గురించి మండల తహసీల్దార్, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పి.ఓ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. ఈ సందర్బంగా కొలాం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మడావి జంగు మాట్లాడుతూ… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కోలాం గిరిజనులకు రెవెన్యూ భూములు పంపిణీ చేయడం జరిగింది అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రతి ఒక్కరికి నూతన పట్టాలు ఇవ్వడంతో రైతు బంధు, రైతు బీమా, పంట రుణాలు పొందుతూన్నారని తమకు మాత్రం పట్టాలు లేకపోవడంతో ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం పొందలేకపోతున్నామని ఆవేదనవ్యక్తం చేశారు. అధికారులు ఇప్పుడైన స్పందించిన, భూమి పట్టాల ఆధారంగా సర్వే చేసి తమకు ధరణి పట్టాలు మంజూరు చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *