సిరా న్యూస్,కొత్తపేట;
నైరుతి రుతుపవనాలు తాకిడితో వర్షాలు కురుస్తున్నప్పటికీ వర్షాన్ని సహితం లెక్కచేయకుండా తెల్లవారు జాము నుండే భక్తులు శనివారం కోనసీమ తిరుపతి వాడపల్లి వేంకటేశ్వరస్వామి దర్శనానికి పోటెత్తారు. ఏడు వరాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అంటూ విలసిల్లిన వాడపల్లి వెంకన్న భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం గా పిలుస్తారు.
ఏడు వారలు పాటు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే తమ కోర్కెలు ఖచ్చితముగా నెరవేరుతాయి అని భక్తులు నమ్మకం, ఆ నమ్మకం తో దేశం నలుమూలలు నుండి అధిక సంఖ్యలో భక్తులు రావడం విశేషం, ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా దర్శనానికి వస్తున్నారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ,వేగుళ్ల జోగేశ్వరరావు, ఉంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు తోపాటు పలువురు రాజకీయ నాయకులు దర్శనానికి వచ్చారు.
ప్రతి రోజు స్వామి వారికీ మేలుకొలుపు, సుప్రభాత సేవ, తొలి హారతి తో సేవలు మొదలయ్యి, భక్తులు దర్శనం తో పాటు వారికి అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేసి,భక్తులకు ఏవిధమైన ఆసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు .