సిరా న్యూస్,అదిలాబాద్;
కుమ్రం భీం ఆసిపాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని దరిగాం అడవుల్లో రెండు పులులు మృత్యువాత పడిన ఘటనలో బాధ్యులైన నలుగురు అధికారులపై ఆటవీశాఖ చర్యలు తీసుకుంది. కాగజ్ నగర్ FDO టి.వేణుబాబు, FRO వేణుగోపాల్ తో పాటు Dy.R.O. పోశెట్టి, FBO శ్రీకాంత్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నలుగురు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, పులులు మృతి చెందడంతో పాటు అటవీ భూమిలో తాజా ఆక్రమణలు జరిగాయని అటవీశాఖ నిర్ధారించింది. పులులను కాపాడుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వాటి కదలికల్ని ఎప్పటికప్పుడు గమనించే ట్రాకర్లకు 10 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం జరిగిందని తేలింది. అందుకే రెండు పులుల మరణానికి కారణాలకు దారితీసిన పరిస్థితులను వివరిస్తూ సీసీఎఫ్ శాంతారాం ఈ నెల 15వ తేదిన పీసీసీఎఫ్ ఆర్.ఎం. డోబ్రియాల్ కు నివేదిక ఇచ్చారు. FDO, FRO లను సస్సెండ్ చేయాలని సూచించారు. దీంతో ఈ నలుగురిని సస్పెండ్ చేశారు. రెండు పెద్దపులుల మరణానికి అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యమే కారణమని శాంతారాం నివేదికతో స్పష్టమైంది. పులుల పర్యవేక్షణకు ఎం-స్ట్రైప్ డేటాను అధికారులు సరిగా పంపలేదు. పులులపై విషప్రయోగం ఒక్కరోజులో జరిగింది కాదు. అవి తిరిగే ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఘటనలకు మూడు వారాల ముందు నేను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఇచ్చిన సూచనలు, ఆదేశాలను FDO, FRO విస్మరించారు. పెంచికల్ పేటలో పులులు తిరిగే ప్రాంతంలో గడిచిన రెండు, మూడు నెలల్లో కొత్తగా జరిగిన ఆటవీ ప్రాంత ఆక్రమణల్ని నిరోధించలేదు. అటవీ ప్రాంతంలో అక్రమంగా షెట్రోల్ బంక్ నిర్మించినా అడ్డుకోలేదు. నాటిన మొక్కల నిర్వహణకు సంబంధించి చేయని ఖర్చులకు లెక్కలు చూపారు. టైగర్ ట్రాకర్ల వేతనాల బిల్లులను చాలా అలస్యంగా పంపించారు.అటు అడవి, ఇటు వన్యప్రాణుల సంరక్షణలో FDO, FRO లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రెండు పులులు మరణించాయని తన నివేదికలో శంతారామ్ స్పష్టం చేశారు. పులులు సంచరించే ప్రాంతంలో తాజా ఆక్రమణలపై ఆయన హెచ్చరించినా FDO దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. పుణుల ప్రాణాలకు కలిగే ముప్పును నివారించడంలో అంతులేని నిర్లక్ష్యం కనబరిచారు. పులులు చనిపోయిన మూడు నాలుగు రోజుల తర్వాత.. అది కూడా పశువుల కాపరులు చెబితే తప్ప అటవీశాఖకు సమాచారం తెలియకపోవడం నిర్లక్ష్యం తీవ్రతకు అద్దం పడుతోంది. మొదటి పులి మరణాన్ని రెండు పులుల మధ్య జరిగిన పోరాటం కారణంగానే అంటూ చేసిన ప్రకటనతో తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అధికారులు ప్రయత్నించడం గమనార్హం. కాగా, పులులు మరణించిన సమయంలో అక్కడ పనిచేసే బేస్ క్యాంపు సిబ్బందిని కొందరు అధికారులు తమ వ్యక్తిగత పనుల నిమిత్తం వాడుకోవడం లాంటి చేష్టలు బయటకొచ్చాయి. ఇకపై ఎలాంటి అశ్రద్ద చేయకుండా అందరు అధికారులు బాధ్యతయుతంగా పనిచేయాలని అన్నారు.