సిరా న్యూస్,చింతూరు;
రంపచోడవరం నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీలో అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి. మొదటి నుండి టీడీపీ నుండి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి కాకుండా, కనీసం పార్టీ సభ్యత్వం లేని మిరియాల శిరీష దేవిని ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించడం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లో వర్గపోరు రచ్చకెక్కింది. కూనవరం మండలంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యనాయకులు సమావేశమై ఆందోళన చేపట్టారు. పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికను పునఃపరిశీలించాలని, లేదంటే రాబోయే ఎన్నికల్లో తాము పూర్తిస్థాయిలో సహకరించబోమని చంద్రబాబుకు అల్టిమేటం జారీచేశారు. పార్టీకోసం కీలకంగా పనిచేసిన అనేకమంది సీనియర్ నాయకులను కాదని… కనీసం పార్టీ కార్యక్రమాల్లో ఎన్నడూ పాల్గొనని శిరీష దేవికి పార్టీ అధిష్ఠానం టికెట్ కేటాయించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. మిరియాల శిరీష దేవి భర్త మఠం భాస్కర్ నేర ప్రవృత్తి కల్గినవాడని, ఉద్యోగాలు ఇప్పస్తానని నియోజకవర్గంలోని అనేకమంది నిరుద్యోగుల నుండి వసూళ్లకు పాల్పడి, నిరుద్యోగులకు లక్షల్లో కుచ్చుటోపీ పెట్టాడని, ఇలాంటి నేర చరిత్ర కల్గిన కుటుంబ నేపథ్యం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిని ఎన్నికచేయడం పట్ల అధిష్టానం పునరాలోచించాలని టీడీపీ కేడర్ కోరుతోంది.