సిరా న్యూస్,హైదరాబాద్;
డీఎస్పీ నళిని… దోమకొండ నళిని… ఈమె చాలా మందికి గుర్తుండే ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పదవిని వదిలేశారు నళిని. 12ఏళ్ల క్రితం పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. మళ్లీ ఇన్నేళ్లకు ఆమె పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పడిపోయింది… తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో… నళినిని గుర్తుచేసుకుంటున్నారు చాలా మంది. సోషల్ మీడియా ఆ పేరు బాగా వినిపిస్తోంది. ఆమెను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవచ్చు కదా అంటూ… సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తులు చేస్తున్నారు. అసలు నళిని ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆమె ఎందుకు పదవిని త్యాగం చేశారు. 2012లో తన డీఎస్పీ పదవికి రాజీనామా చేశారు నళిని. అది తెలంగాణ ఉద్యమకాలం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్న వారిపై లాఠీలు ఝుళించలేనంటూ… ఆమె ఉద్యోగానికి రాజీనామా చేశారు. తెలంగాణ ఏర్పడ్డాకే మళ్లీ ఉద్యోగం చేస్తా అంటూ.. డీఎస్పీ స్థాయి పదవిని వదిలేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసి కేంద్రానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షను బలంగా చాటారు. కానీ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆమె కనిపించకుండాపోయారు. ఉద్యమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా… నళిని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు రేవంత్రెడ్డి ప్రభుత్వం అయినా… నళినిని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని విజ్ఞప్తులు వెళ్లువెత్తుఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా వేసిన ఆమెకు మళ్లీ న్యాయం చేయాలని అడుగుతున్నాయి. అయితే… వీటన్నింటికీ సమాధానంగా… నా మనసులో మాట అంటూ… నళిని పేరు మీద ఒక మెసేజ్ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.నా మనసులో మాట.. నేను డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి 12ఏళ్లు పూర్తి అయిన తర్వాత కూడా… నన్ను ఇంకా జనం గుర్తుంచుకున్నారన్న విషయం ఈరోజు వస్తున్న మెసేజ్ల ద్వారా నాకు అర్థం అవుతోంది. చాలా సంతోషం.. నన్ను గుర్తుపెట్టుకున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. కొందరు జర్నలిస్టులు వాయిస్ కావాలి అని అడుగుతున్నారు… నేను దీనికి సుముఖంగా లేను. ఎందుకంటే నేను ప్రస్తుతం ప్రశాంత జీవితం గడుపుతున్నాను. అందుకే ఇలా ప్రకటన చేయాల్సి వచ్చింది.ప్రస్తుతం నేను ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ యజ్ఞ బ్రహ్మగా వేద ప్రచారకురాలిగా, ఆర్ష కవయిత్రిగా తపోమయ జీవనం గడుపుతున్నాను. పూర్తి సాత్వికంగా మారాను