జ్వరాలు ప్రబలే గ్రామాలను ట్యాగ్ చేసి ఇంటింటి జ్వర సర్వే చేపట్టాలి
సమయ పాలన పాటించాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి;
విధుల నిర్వహణలో భాగంగా వైద్యుల షెడ్యూల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం చిట్యాల మండల కేంద్రంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. రోగుల వివరాలు ఆన్లైన్ లో నమోదును పరిశీలించారు. ఆసుపత్రి మొత్తం పరిశీలించారు. ఈ సందర్భంగా సాధారణ, చిన్న పిల్లలు, ప్రసూతి వార్డులను పరిశీలించి వైద్య చికిత్సలు పొందుతున్న ప్రజలను ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నారు, వైద్య సేవలు ఎలా ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రేపాక గ్రామానికి చెందిన కె లక్ష్మి నారాయణ ఆసుపత్రికి ఎముకలు, న్యూరో వైద్యలను నియమించాలని, ఎం ఆర్ ఐ సేవలు అందుబాటులోకి తేవాలని కోరగా ఖాళీలు భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. చికిత్స పొందుతున్న చల్లగరిక గ్రామానికి చెందిన ఎం అర్చన, 13 సంవత్సరాల బాలికను వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. డెంగీ చికిత్సకు ఆసుపత్రికి వచ్చిన ప్రధమ బాలిక అని, ప్రస్తుతానికి డెంగీ నుండి పూర్తిగా కోలుకున్నదని వైద్యులు తెలుపగా ఆరోగ్యం పూర్తిగా కుదుట పడే వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏం వ్యాధితో బాధపడుతున్నారు, వైద్యసేవలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకుని చికిత్స పొందుతున్న ప్రజలు చెప్పిన సమాదానానికి సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సేవల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించాలని ఆయన స్పష్టం చేశారు. ఆసుపత్రికి కావాల్సిన సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు. నీటి లీకేజీని పరిశీలించిన కలెక్టర్ మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూడు షిఫ్టుల్లో వైద్యులు అందుబాటులో ఉండే విధంగా షెడ్యూల్ తయారు చేయాలని ఆదేశించారు. ఆగస్టు నెల్లలో 3578 మందికి ఓపి, 655 మందికి ఇన్ పేషేంట్స్ కు వైద్య సేవలు అందించారని, 122 ఏఎన్సీ, 12 ప్రసవాలు, 8 ట్యూబెక్టమి శస్త్ర చికిత్సలు చేసినట్లు తెలిపారు. ప్రసవాలు పెంచాలని, ఇందుకొరకు అశాల ద్వారా గర్భిణీ మహిళల జాభితా సేకరించి నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలు, నిర్వహణ బావుందని ఇదే విధముగా అన్ని కాలాల్లో పరిశుభ్రంగా ఉంచాలని అభినందించారు. వ్యాధులు ప్రబలే కాలమని వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పాము, కుక్క కాటు మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. క్రిమి సంహారక మందులు సేవించి బలవన్మరణానికి పాల్పడుతున్న కేసులు గురించి కారణాలను అడిగి తెలుసుకున్నారు.
జ్వరాలు ప్రబలే గ్రామాలను ట్యాగ్ చేసి ఇంటింటి జ్వర సర్వే చేపట్టాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మండల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి, వైద్యులు డా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.