-వరుస ఆందోళనలు, నిరసనలు
-ఫ్యాక్టరీకి అనుమతి ఇవ్వొద్దని డిమాండ్
సిరా న్యూస్,నిర్మల్;
దిలావర్పూర్-గుండంపెల్లి గ్రామాల సమీపంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును రైతులు, గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజారోగ్యంతోపాటు పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని.. పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇవ్వవద్దని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆందోళనబాట పట్టిన రైతులు, సమీప గ్రామ ప్రజలు.. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. దిలావర్పూర్ నుంచి గుండంపల్లి గ్రామానికి వెళ్లే దారిలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు ఓ సంస్థ రైతుల నుంచి 40 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. వరి, మొక్కజొన్న పంటల నుంచి ఇథనాల్ను ఉత్పత్తి చేస్తామని యాజమాన్యం చెబుతోంది. గుండంపల్లి చుట్టుపక్కల ఈ రెండు పంటల ఉత్పత్తి గణనీయంగా ఉండటంతో పరిశ్రమ ఏర్పాటుకు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే, ఏ పరిశ్రమ పెడుతున్నారో చెప్పకుండా ఉద్యోగాలు ఆశచూపి మధ్యవర్తుల ద్వారా తమ భూమిని కొనుగోలు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో స్థానిక నేతల హస్తం ఉందని మండిపడుతున్నారు. ఇథనాల్ పరిశ్రమ అని ముందే చెబితే భూమిని ఇచ్చేవాళ్లం కాదని స్పష్టం చేస్తున్నారు. ఇథనాల్ ఉత్పత్తి వల్ల వెలువడే రసాయన వాయువులు, కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యల వస్తాయని భయపడుతున్నారు. పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూసారం కూడా దెబ్బతింటుందని కలవరపడుతున్నారు. ఇప్పటికే ఇథనాల్ ఫ్యాక్టరీ నడుస్తున్న ప్రాంతాల నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా జరగబోయే నష్టాలను తెలుసుకున్నామని వాపోతున్నారు. దీంతో గుండంపల్లి, దిలావర్పూర్ ప్రజలు, రైతులు జేఎసీలు ఏర్పాటు చేసుకుని గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నాయి. ఫ్యాక్టరీ నిర్మాణం గురించి అధికారులను ప్రశ్నించగా ఇథానాలు ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే వారు ఫ్యాక్టరీ నిర్మాణానికి సమర్పించిన డాక్యుమెంట్స్ కేంద్రం దగ్గర ఉంటాయని మాకు ఇట్టే విషయంపై తెలదని ఇక్కడి అధికారులు అంటున్నారు.