ఆర్టీసీ బస్సులో తాగుబోతు వీరంగం

 సిరా న్యూస్,వేములవాడ;
టికెట్ తీసుకున్న తనకు బస్సులో సీటు కూడా చూపించాలని మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ ఆర్టీసీ బస్టాండు సమీపంలోని తిప్పాపూర్ లో అర్ధరాత్రి జరిగింది. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి రాజన్న దర్శనానికి తన కుటుంబ సభ్యులతో వచ్చి తిరిగి వెళ్లేందుకు బస్టాండుకు వచ్చాడు.మద్యం సేవించిన వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి బస్సు ఎక్కాడు. డ్రైవర్ సదరు వ్యక్తి వద్ద టికేట్ తీసుకున్నాడు. అయితే టికెట్ తీసుకున్న తనకు సీటు చూపించాలని, బస్సులో ఎక్కడ కూడా సీట్లు ఖాళీగా లేవని, డ్రైవర్ తో గొడవకు దిగాడు. తనకు సీటు కెటాయిస్తేనే బస్సు ముందుకు కదలాలని భీష్మించుకు కూర్చున్నాడు. చేసేదేమిలేక డ్రైవర్ బస్సును వదిలేసి సంబందిత అధికారులకు సమాచారం అందించాడు. చాలాసేపటి వరకు బస్సు నిలిచిపోవడంతో విసుగుచెందిన ప్రయాణికులు సదరు వ్యక్తికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎంత చెప్పినా వినకపోవడంతో ప్రయాణికులు మందలించారు. ఆగ్రహానికి లోనైన వ్యక్తి అడ్డం వచ్చిన వారిని కొట్టడం మొదలుపెట్టాడు. ఆడవాళ్లని కూడా చూడకుండా చేయి వేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో సదరు వ్యక్తితో పాటు పలువురికి గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఎంత ఆపేందుకు ప్రయత్నం చేసినా వినకపోవడంతో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి, పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులకు సైతం సహకరించకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సులో ప్రయాణికులను పంపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *