సిరాన్యూస్, ఆదిలాబాద్
మూడు వ్యభిచార గృహాల పై దాడి : ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి
నిర్వాహకులు, విటులపై కేసులు నమోదు
* సీసీఎస్, ఆదిలాబాద్ పట్టణ పోలీసులు స్పెషల్ ఆపరేషన్
* బాధిత మహిళలకు పునరావాస ఏర్పాటుకు కృషి
ఆదిలాబాద్ పట్టణంలో బుధవారం రాత్రి జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ సీసీఎస్ పోలీసులు, పట్టణ పోలీసులు సంయుక్తంగా పట్టణంలోని పలు వ్యభిచార గృహాలపై దాడిని నిర్వహించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణం మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ, టీచర్స్ కాలనీలో, అలాగే ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యానగర్లో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు మహిళలు, 9 మంది పురుషును అరెస్టు చేసినట్లు తెలియజేశారు. న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో శాంతినగర్కు చెందిన హెచ్ వంశీకృష్ణ , న్యూ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన కే బాబాసాహెబ్ (ఎన్జీవో కోఆర్డినేటర్), శాంతినగర్కు చెందిన ఎస్ అశోక్ పట్టుబడ్డారు. ఇందులో కపిల్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. టీచర్స్ కాలనీ లో ఎన్ రవితేజ, మన్నూర్కు చెందిన కే విశాల్ పట్టుబడ్డారు. విద్యానగర్ లో గుడిహత్నూర్కు చెందిన షేక్ సలీం , మహాలక్ష్మివాడకు చెందిన అద్నాన్ అహ్మద్ ,ఎండి అజీముద్దీన్లు పట్టుబడ్డారు. మొత్తంగా ముగ్గురు మహిళలు, 9 మంది మగవారిపై మావల పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 137 138 లతో, ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో 166 తో అండర్ సెక్షన్ 3 , 4 , 5 ఎమోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ ఆక్ట్ – 1956 తో కేసులు నమోదు చేయబడినట్లు తెలియజేశారు. ముఖ్యంగా నిర్వాహకుడైన కే బాబా సాహెబ్ ఆలియాస్ తరుణ్, శూర్ ఎన్జీవో ద్వారా నియమితుడై, హెచ్ఐవి పై అవగాహన పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అమాయకులైన మహిళలను ఉచ్చులోకి లాగుతూ బలవంతంగా వ్యాపారాలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఎన్జీవో ప్రతినిధులకు తరుణ్ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై నివేదికను పంపనున్నట్లు తెలియజేశారు. బాధిత మహిళలకు పునరావాస కల్పించే విధంగా సంబంధిత శాఖలకు సిఫార్సు చేస్తున్నట్లు తెలియజేశారు. జిల్లావ్యాప్తంగా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలైనా, వ్యవస్థీకృత నేరాలను నిర్వహించే వారినైన సహించేది లేదని, వారిపై కఠిన చర్యలు తప్పవనిజిల్లా ఎస్పీ హెచ్చరించారని తెలియజేశారు . వీరి వద్ద నుండి రూ 7,500/- నగదు, 11 సెల్ ఫోన్లు, నాలుగు మోటర్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్టు తెలియజేశారు. సమావేశంలో ఆదిలాబాద్ రూరల్ సీఐ కె ఫణిధర్, ఆదిలాబాద్ రెండో పట్టణ సీఐ అశోక్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, మావల ఎస్ఐ వి విష్ణువర్ధన్, సిసిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.