సిరా న్యూస్,విజయవాడ;
ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మలగన్న అమ్మ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఘనంగా శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా ఆషాడ మాసంలో మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలు విఘ్నేశ్వర పూజతో ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు అమ్మవారు శాకంబరి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శాకంబరీ రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మని దర్శించుకోవానికి భారీ సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రి కొండ మీదకు చేరుకుంటున్నారు. శాకంబరీ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని తరిస్తున్నారు. ఇంద్రకీలాద్రి ఎక్కడ చూసినా రకరకాల కూరగాయలతో కనిపిస్తూ విబిన్న అందాలతో ఆకట్టుకుంటుంది. అమ్మవారి సహా ఆలయ ప్రాంగణం అలంకారానికి మొత్తం 25 టన్నుల పండ్లు, కూరగాయలను ఉపయోగించారు. ఈ అలంకారం భక్తులను విపరీతంగా కట్టుకుంటుంది.ఆషాడ మాసం త్రయోదశి తిది నుంచి ఆషాఢ పౌర్ణమి వరకు అంటే మూడు రోజుల పాటు నిర్వహించే శాంకంబరి ఉత్సవాల్లో మొదటి రోజు (శుక్రవారం) ఉదయం విఘ్నేశ్వర పూజతో కార్యక్రమాన్ని మొదలు పెట్టి ఋత్విక్ వరుణ, పుణ్యాహవచనము, అఖండ దీపారాధన చేసి శాకంబరి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ రోజు సాయంత్రం 4. గంటలకు కలశస్థాపన, అగ్నిప్రతిష్టాపన, మండపారాధన హారతి, మంత్రపుష్పము ఉండనుంది. అంతరం భక్తులకు ప్రసాద వితరణ చేయనున్నారు. ఈ శాకంబరి ఉత్సవాల సందర్భంగా ఈ 3 రోజులూ భక్తులకు కదంభం ప్రసాదం పంపిణీ చేయనున్నారు.