సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మొదలుపెట్టి వారం రోజులు పూర్తయింది. వారంలోనే ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు హామీలను అమల్లోకి తెచ్చేసింది. మిగిలిన వాటిని అమలు చేసేందుకు.. గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుటోంది కాంగ్రెస్ ప్రభుత్వం.డిసెంబర్ 3న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 64 స్థానాల్లో విజయకేతనం ఎగువేసింది కాంగ్రెస్ పార్టీ. సొంతంగానే మెజారిటీ రావడంతో ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. డిసెంబర్ 5న తెలంగాణ సీఎంగా రేవంత్రెడ్డిని ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. డిసెంబర్ 7న తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు రేవంత్రెడ్డి. ఆయనతో పాటు 11 మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశారు. అలాగే వికలాంగురాలు అయిన రజినీకి ఉపాధి కల్పించే ఉత్తర్వుపై సంతకం చేశారు సీఎం రేవంత్రెడ్డి. ప్రమాణస్వీకారానికి ముందే ప్రగతిభవన్ పేరును… బీఆర్ అంబేద్కర్ ప్రజాభవన్గా మార్చారు. ప్రగతిభవన్ ముందున్న ఇనుప బారికేడ్లను కూడా తొలగించారు. ప్రమాణస్వీకారం చేసిన రోజు సాయంత్రమే కేబినెట్ సమావేశం కూడా నిర్వహించారు. ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరు గ్యారెంటీల అమలు, రైతులకు ఆర్థిక సాయం వంటి అంశాలపై చర్చించారు. ఇక 2014 నుంచి డిసెంబర్ 7 వరకు ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా 100 రోజుల్లో అన్ని హామీలను నెరవేరుస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు తెలిపారు. డిసెంబర్ 8న… విద్యుత్ శాఖపై రివ్యూ చేశారు సీఎం రేవంత్రెడ్డి. డిస్కమ్లు దాదాపు రూ. 85 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయని అధికారులు చెప్పారన్నారు.