సిరా న్యూస్,అవనిగడ్డ;
అవనిగడ్డ పంచాయతీ పరిధిలో 8వ వార్డుకు చెందిన షాలేమ్ డ్వాక్రా గ్రూప్ సభ్యులకు లోన్లు మంజూరు కానివ్వకుండా ఆ గ్రూప్ కి చెందిన బుక్ కీపర్ రత్నకుమారి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని షాలేమ్ డ్వాక్రా గ్రూప్ సభ్యులు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, డిప్యూటీ తహసీల్దార్ కి వినతిపత్రం అందించారు. అవనిగడ్డ స్టేట్ బ్యాంక్ లో షాలేమ్ డ్వాక్రా గ్రూప్ ఖాతాను తెరిచి గత కొన్నేళ్లుగా లోన్లు తీసుకుంటూ, క్రమపద్ధతిలో డబ్బులు కడుతూ వస్తున్నామని, ప్రస్తుతం తమ గ్రూప్ కి 3 లక్షల రూపాయలు మాత్రమే అప్పు ఉందని, కొత్త అప్పు కోసం బ్యాంక్ వారిని సంప్రదిస్తే తమ గ్రూప్ కి లోన్ మంజూరు చేయడానికి అంగీకారం తెలిపిన తర్వాత బుక్ కీపర్ రత్న కుమారి వచ్చి తమకు లోన్ ఇవ్వకుండా అడ్డుపడిందని, లంచం ఇస్తే కానీ తమకు లోన్ మంజూరు చేయనివ్వను అని ఖరకండిగా చెప్పిందని గ్రూప్ సభ్యులు తెలిపారు.
బుక్ కీపర్ పై ఫిర్యాదు చేయడానికి వెలుగు సిసి, ఎ సి ల వద్దకు వెళితే సిసి సువర్ణ స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నుండి ఫోన్ చేయిస్తేనే మీ గ్రూప్ కి లోన్ మంజూరు చేయిస్తామని అన్నారన్నారు. ఎ సి రవి కుమార్ మహిళలు అని కూడా చూడకుండా తమపై చెప్పుకోవడానికి వీలు లేని అసభ్య పదజాలం ఉపయోగిస్తూ మాట్లాడుతున్నారని అన్నారు.
తమ గ్రూప్ కంటే ఎక్కువ రుణాలు చెల్లించాల్సిన గ్రూప్ లకు సైతం డబ్బులు ఇస్తే కొత్త లోన్లు మంజూరు చేస్తున్నారని, తమకు మాత్రం లోన్ మంజూరు చేయకుండా లంచం ఇస్తే కానీ లోన్ మంజూరు చేయనని చెప్పడం, ఎమ్మెల్యే కార్యాలయం నుండి ఫోన్ చేయించమని చెప్పడం, మహిళలపై అసభ్య పదజాలం ఉపయోగించడం వంటి పనులు చేస్తూ డ్వాక్రా గ్రూప్ సభ్యులను లోన్లు ఇవ్వకుండా వేధిస్తున్న వెలుగు ఎసి, సిసి, బుక్ కీపర్ లను విధుల నుండి సస్పెండ్ చేసి, షాలేమ్ గ్రూప్ సభ్యులకు న్యాయం చేయమని కోరారు. షాలేమ్ గ్రూప్ సభ్యులకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు.