సిరాన్యూస్, ఇచ్చోడ
బైపాస్ రోడ్డు ఇలా… ప్రయాణం ఎలా?
* ఇబ్బంది పడుతున్న వాహనదారులు
* పనులు త్వరగా పూర్తి చేయాలని మొర
ఇచ్చోడ మండల కేంద్రంలోని అదిలాబాద్ బైపాస్ నుండి నిర్మల్ బైపాస్ వరకు రూ. 13 కోట్ల నిధులతో చేపట్టిన 2.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు, డివైడర్ పనులు నత్తనడకన సాగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు ప్రారంభించి 9 నెలలు గడుస్తున్నప్పటికీ ఆశించిన రీతిలో పనుల్లో వేగం కనిపించడం లేదు. కాగా ఒకవైపు రోడ్డు పై మొరం, కంకర, చిప్స్ పరిచి పూర్తి చేశారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు. రాత్రి వేళల్లో ఆ రోడ్డు గుండా వెళ్లాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు రొడ్డును తవ్వి, మొరం పోసి వదిలేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతోనే రోడ్డు, డివైడర్ విస్తరణ పనులు వేగంగా జరగడం లేదనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. రోడ్డుకి అక్కడక్కడ పనులు చేపడుతూ మధ్య మధ్యలో పనులు నిలిపివేస్తుండడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఆయా గ్రామాల నుంచి మండల కేంద్రానికి రావాలంటే రోడ్డు పై కంకర తేలి గుంతలుగా ఉండటంతో ద్విచక్రవాహనాలు, ఆటోల్లో వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. వర్షం వచ్చిందంటే ప్రయాణం చేయలేమంటున్నారు. అధికారులు స్పందించి రోడ్డు, డివైడర్ విస్తరణ పనుల్లో వేగం పెంచి పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రజలు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.