తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకం

విద్యా వ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి
కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్భోద
సిరా న్యూస్,హైదరాబాద్ ;
తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకమని, విద్యా వ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి పేద విద్యార్థి కోసం ప్రభుత్వం ప్రతి నెల రూ.85 వేలు ఖర్చు పెడుతోందన్నారు. ప్రజాపాలన, ఖరీఫ్ సాగు, సీజనల్ వ్యాధులు, వన విద్య, మహిళా శక్తి, డ్రగ్స్ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణ తదితర అంశాలపై మంగళవారం కలెక్టర్లు, పోలీస్ కమిషనర్‌లు, ఎస్పీలతో సిఎం రేవంత్ రెడ్డి సమావేమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉందన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు విశ్వాసం కల్పించాలని, ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారులను గుర్తించాలని, ప్రజలకు లబ్ధి చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు ఉండాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకునేలా కలెక్టర్లు పని చేయాలన్నారు. డిసెంబర్ 24న కలెక్టర్లతో తొలిసారి భేటీ నిర్వహించామని, ఎన్నికల కోడ్ ముగియగానే కలెక్టర్ల బదిలీలు నిర్వహించామని, కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినవారు ఉన్నారని, తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే సరైన సేవలు అందించవచ్చని, తెలంగాణ మీ సొంత రాష్ట్రంగా భావించి పని చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఆలోచన ఏంటో తెలుసుకోవాలని, ఎసి గదులకే పరిమితమైతే కలెక్టర్లకు కూడా సంతృప్తి ఉండదని, మీ ప్రతి చర్య ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలన్నారు. ప్రజా ప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలన అందించాలని రేవంత్ ఆదేశించారు. సంక్షేమం, అభివృద్ధి ముందుకు తీసుకెళ్లే బాధ్యత కలెక్టర్లపై ఉందని, క్షేత్రస్థాయిలో వారు పర్యటించాల్సిందేనన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *