ఎన్నికల అభ్యర్థులు తప్పనిసరిగా ఖర్చుల వివరాలు సమర్పించాలి

– జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

సిరా న్యూస్,నాగర్ కర్నూల్;
నాగర్ కర్నూల్ జిల్లాలోని నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 43 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు నిర్ణీత తేదీలోగా పూర్తిస్థాయి అకౌంట్స్, ఎన్నికల వ్యయం వివరాలను జనవరి 2వ తేదీ వరకు అందించాలని, లేదంటే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అవుతారని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మూడు నియోజకవర్గాలకు చెందిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలు నిలిచిన అభ్యర్థులు అభ్యర్థుల ప్రతినిధులతో ఎన్నికల్లో ఖర్చు చేసిన లెక్కల అకౌంట్స్ వివరాల సమర్పణపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల వ్యయంపై కఠిన నిబంధనల ప్రకారం బిల్లులు, ఓచర్లతో సహా లెక్కచూపించాలన్నారు.విఫలమైతే మూడేళ్ల కాలానికి అనర్హత వేటు పడుతుందన్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల కమిషన్కు ఖర్చు వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని, ఎన్నికల ఫలితాలు వెల్లడైన 30 రోజుల్లోగా అభ్యర్థి ఖర్చు వివరాలు పూర్తి స్థాయిలో లెక్కలతో సమర్పించాలని, లేకుంటే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 10 ఏ నిబంధన కింద కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు.
మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తుందన్నారు. ఎన్నికల్లో కొత్తగా పోటీ చేసిన అభ్యర్థులు ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల వివరాల అకౌంట్స్ సమర్పించడానికి సందేహాలు ఏమైనా ఉంటే రేపటినుండి ఈనెల 28వ తేదీ వరకు ఆయా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఎన్నికల సహాయ వ్యయ అధికారులు అందుబాటులో ఉంటారని వారికి చూయించి లెక్కలను సరిచూసుకోవాలని సూచించారు.
ఈనెల 29వ తేదీ నుండి జనవరి 2వ తేదీ వరకు 4 రోజులపాటు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కేంద్ర ఎన్నికల ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ భేరా రామ్ చౌదరి అకౌంట్స్ పరిశీలన చేస్తారని ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా పూర్తిస్థాయి లెక్క పక్కాగా ఉండాలన్నారు. చేసిన ప్రతి పైసకు సరైన ఆధారం చూపాలన్నారు. ప్రతి వ్యయానికి సంబంధించిన రశీదులు, ఓచర్లు తప్పకుండా పెట్టుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *