ఎన్నికల అడుగులు… డిసెంబర్ 22, 23 తేదీల్లో కీలక సమావేశాలు

సిరా న్యూస్,విజయవాడ;
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు మొదలు పెడుతోంది.. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికోసం ఏర్పాట్లను ప్రారంభించనుంది. 2019లో ఏపీ అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. వచ్చే ఏడాది జూన్ 10వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగా ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితాలు, పోలింగ్ స్టేషన్లు, సిబ్బంది వంటి అంశాలపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు రాష్ట్రానికి రానున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితాలో అవకతవకలు, నకిలీ ఓట్లు, డబుల్ ఎంట్రీ ఓట్ల పై తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనాకు ఫిర్యాదులు చేసాయి. అక్కడితో ఆగలేదు కదా ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ కు సైతం వైసీపీ, టీడీపీ, బీజేపీ లు ఫిర్యాదు చేసాయి. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేస్తున్నారనేది ప్రధాన పార్టీల ఆరోపణ.. ఫారం – 7 ద్వారా భారీగా ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఒకవైపు ఓటర్ల జాబితా పై ఇప్పటికే వచ్చిన అభ్యంతరాలపై అధికారులు పరిశీలన చేస్తున్నారు..ఈ నెల 26 వ తేదీ వరకూ ఓటర్ జాబితా పరిశీలన జరగనుంది. ఆ తర్వాత జనవరి ఐదో తేదీన ఫైనల్ ఎస్ఎస్ఆర్ ను విడుదల చేయనుంది ఎన్నికల కమిషన్.. ఈ ప్రక్రియ ఒకవైపు జరుగుతుండగానే సీఈసీ అధికారులు బృందం రాష్ట్రానికి వస్తుండటంతో ఎన్నికల హడావుడి ప్రారంభం కానుంది.. ఏపీలో అసెంబ్లీ తో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీంతో ఈసీ పక్కాగా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతోంది.రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం రాష్ట్రానికి రానుంది. ఈ నెల 21 వ తేదీన సాయంత్రం విజయవాడకు చేరుకోనుంది. ఈ నెల 23 వ తేదీన 26 జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలు, ఇతర ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు. ఆయా జిల్లాల వారీగా ఓటర్ల జాబితాలు, ఎన్నికలకు సంబంధించి అవసరమైన ఇతర అన్ని ఏర్పాట్లు, సున్నితమైన ప్రాంతాలు.. ఇలా అన్ని విషయాలపై అధికారుల నుంచి సమాచారం తీసుకునున్నారు. మొదటి రోజు అన్ని జిల్లాలకు సంబందించిన సమీక్షలు పూర్తి కాకుంటే ఈ నెల 23 వ తేదీ కూడా మిగిలిన జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. ఇక జిల్లాల అధికారులతో సమావేశం ముగిసిన తర్వాత ఈ నెల 23 వ తేదీ మద్యాహ్నం సచివాలయం లో ఎన్నికలకు సంబంధించిన శాఖల అధికారులతో సమావేశమవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *