తొమ్మిన్నరేండ్ల కేసీఆర్‌ పాలనలో ఒక్క ఎకరం కూడ ఎండలే

-కాంగ్రెస్సోళ్ల భరోసాతోనే రైతులు నష్టపోయిండ్లు

-ఎండిన పంట ఎకరాకు రూ.25వేల నష్టపరిహరం ఇయ్యాలే

-మాజీ మంత్రి, ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌

సిరా న్యూస్,మంథని;

తొమ్మిన్నరేండ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో ఎక్కడా ఒక్క ఎకరం ఎండలేదని మాజీ మంత్రి, పెద్దపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.
మంగళవారం మంథని మున్సిపల్‌ పరిధిలోని పోచమ్మవాడ సమీపంలో ఎండిన పంటపొలాలను జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఎండిన పంటలను చూపిస్తూ కన్నీరు పెట్టుకున్న రైతులను వారు ఓదార్చారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అదికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పాలకులు నీళ్లిస్తామని భరోసా ఇవ్వడం మూలంగానే రైతులు పంటలు సాగుచేసుకున్నారని, పంటలు సాగుచేసుకున్న తర్వాత నీళ్లివ్వక పోవడంతో నష్టపోయారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం అదికారంలో ఉన్నప్పుడు వర్షాబావం ఏర్పడి నీళ్లు లేని పరిస్థితుల్లో నీళ్లు ఇవ్వలేమని ముందుగానే రైతులకు చెప్పామని, దాంతో రైతులు కూడా పంట సాగుకు ముందుకు రాలేదన్నారు. రైతుల పట్ల ముందుచూపు లేని కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడు మాసాల్లో రైతులకు కన్నీరు మిగిల్చిందని ఆయన అన్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతే పరామర్శించి ఆదుకుంటామని భరోసా ఇవ్వాల్సింది పోయి గత ప్రభుత్వం, పాలకులపై నిందలు వేయడం, విమర్శలు చేయడం విడ్డూరంగాఉందన్నారు. అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ఆనాడు తమ ప్రభుత్వం రైతులకు నష్టపరిహరం అందించి ఆదుకుందనే విషయాన్ని కాంగ్రస్‌ పాలకులు గుర్తించాలన్నారు. ఎండిన పంట ఎకరాకు రూ.25వేల చొప్పున అందించి ఆదుకోవాలని, అలాగే పంట మద్దతు ధర రూ.500 బోనస్‌పై వెంటనే ప్రకటన చేయాలని ఆయన ఈ సందర్బంగా డిమాండ్‌ చేశారు.
ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషిస్తే రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడటం విడ్డూరంగా ఉందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు.
మంథని పట్టణంలోని పోచమ్మవాడ సమీపంలో బిరుదు మల్లయ్య,శ్రీనివాస్‌ల ఎండిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మల్లయ్య, శ్రీనివాస్‌లు 14ఎకరాల్లో పంట సాగు చేశారని, నెల రోజులుగా నీళ్లు రాకపోవడంతో పంట పూర్తిగా చేతికి రాకుండా పోయిందని, అప్పులు, ఆస్తులు అమ్ముకుని పంటలు వేసుకుంటే కాంగ్రెస్‌ పాలకుల అసమర్థతతో ఆగమై పోయారని ఆయన వాపోయారు. ఎండిన పంటలకు నష్టపరిహరంతో పాటు మిగిలిన పంటలను కాపాడాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ నేతృత్వంలో రైతులతో కలిసి 36గంటల నిరసన దీక్ష చేపట్టితే జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించాల్సిన పాలకులు జిల్లా కేంద్రంలో కూర్చుండి అధికారంలో లేని వాళ్లపై అబండాలు వేస్తున్నారని అన్నారు. గత సెప్టెంబర్‌, అక్టోబర్ మాసాల్లో వర్షాలు కురియలేదని మంత్రి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, గత రెండు మాసాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురిసినట్లు రికార్డులు ఉన్నాయని, రెండు మాసాల్లో సాధారణ వర్షాపాతం 177.5 ఉండాల్సి ఉండగా 251.9శాతం అత్యధికంగా వర్షాపాతం నమోదు అయిందన్నారు. పంటలకు సాగునీరు అందించలేక నీళ్లు లేవని, వర్షాలు కురియలేదని సాకులు చెబుతున్నారని ఆయన దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో ఏనాడైనా ముఖ్యమంత్రి రైతులను పట్టించుకున్నాడా అని విమర్శలు చేస్తున్నారని, ప్రజల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్‌ పెద్దలు ఏనాడైనా రైతులను పరామర్శించి భరోసా ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా గత ఏడాదిలో అకాల వర్షాలతో పంట నష్ట జరిగితే ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకుందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ అసమర్థతను కప్పి పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారే కానీ రైతులకు మనోధైర్యం కల్పించాలనే ఆలోచన చేయడం లేదని ఆయన విమర్శించారు. ప్రతిపక్షంలో ఉండి తాము పోరాటం చేస్తే రాజకీయమంటున్నారని, రైతుల్లో చైతన్యం రావాలని, కాంగ్రెస్‌ మెడలు వంచాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులకు నష్టపరిహరం అందించి ఆదుకునే వరకు పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *