-కాంగ్రెస్ సర్కార్లోనే అక్రమంగా ఇసుక తరలిస్తాండ్లు
-నిరాధార ఆరోపణలు చేసి ప్రజల నుంచి దూరం చేసిండ్లు
-ప్రజల కోసమే పని చేశా…నా పక్షాన ప్రజలే ప్రశ్నించాలే
-ప్రెస్మీట్లో జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
సిరా న్యూస్,మంథని;
పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా, జెడ్పీ చైర్మన్గా పని చేసిన తనపై కాంగ్రెస్ నాయకులు లేని పోని ఆరోపణలు చేశారని, ఈ ప్రాంతంలోని ఇసుక క్వారీలు, లారీలన్నీ తనవేనని బదనాం చేశారని, ఇసుక క్వారీలు, లారీల ఆధారాలు చూపించాలని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు.
బుధవారం మంథని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంలో ఒకసారి ఎమ్మెల్యేగా, మరోసారి జెడ్పీచైర్మన్గా పదవీ బాధ్యతలు నిర్వహించానని, ఆనాడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హైదరాబాద్కు మకాం మార్చకుండా ఇక్కడే ఉంటూ ప్రజలతో కలిసి వారికి తనవంతు సేవలు అందించానని అన్నారు. ప్రజలకు సేవ చేయడాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు నాటి నుంచి మొన్నటి వరకు తనపై అసత్యపు ఆరోపణలు చేశారని అన్నారు. ఈ ప్రాంతంలో నడుస్తున్న ఇసుక క్వారీలన్నీ తనవేనని, లారీలన్నీ తనవేనని ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టారని అన్నారు.ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న క్వారీలే ఇప్పుడు నడుస్తున్నాయని, ఆనాడు ఇసుక క్వారీలు, ఇసుకకు సంబంధించి డబ్బులు ప్రభుత్వ ఖజానాకు చేరేవని, కానీ ఈనాడు అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని అన్నారు. ఇటీవలి కాలంలో భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్, కాటారం, మంథని, ముత్తారం మండలాల్లోని ఇసుక క్వారీల నుంచి అక్రమంగా తరలివెళ్లున్న అనేక లారీలను పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారని ఆయన అన్నారు. అక్రమ ఇసుక రవాణా ఏ ప్రభుత్వం,ఎవరి హయాంలో జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఆనాడు తనపై అసత్య ప్రచారం చేశారని, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తనపై చేసిన ఆరోపణలను ఎందుకు రుజువు చేయడం లేదని ప్రశ్నించారు. కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించి తనను దూరం చేయాలన్నదే వారి లక్ష్యమన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి అధికారం అప్పగిస్తే వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యేగా జెడ్పీ చైర్మన్గా తాను ఈ ప్రాంత ప్రజల కోసమే పనిచేశానని, మొట్టమొదటి బీసీ బిడ్డగా అవకాశం వస్తే ఈ ప్రాంతంలోనిపేదవర్గాలకు మేలు చేయాలని తాపత్రయపడ్డానని అన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రజల నుంచి దూరం చేసిన కాంగ్రెస్సోళ్లను ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, మంథని నియోజకవర్గ ప్రజలు తన పక్షాన కాంగ్రెస్ నాయకులను ఆధారాలు చూపించాలని డిమాండ్ చేయాలన్నారు. 2018, 2023లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ నాయకులు రాబోయే ఎన్నికల వరకు ఎదురు లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని, రాబోయే రోజులు మంథని నియోజకవర్గంలో ఎవరిని ఎదుగనీయకుండా చేయడంతో పాటు ఎదిగిన తనను ఖతం చేయాలని చూస్తన్నారని ఆయన వాపోయారు. తన గన్మెన్లు పోయిన వెంటనే తనపై దాడులు చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రజలు చైతన్యవంతులై తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని కాంగ్రెస్సోళ్లను ప్రశ్నించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ ఆరేపల్లి కుమార్ నాయకులు తగరం శంకర్ లాల్, జక్కు రాకేష్, వేల్పుల గట్టయ్య లతో పాటు పలువురు పాల్గొన్నారు.
========================