Jogu Ramanna: ప్ర‌జ‌ల‌ను మోసం చేయడంలో సీఎంకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి : మాజీ మంత్రి జోగు రామన్న

సిరాన్యూస్‌,ఆదిలాబాద్‌
ప్ర‌జ‌ల‌ను మోసం చేయడంలో సీఎంకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి : మాజీ మంత్రి జోగు రామన్న
*యావత్ రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి

అన్నం పెట్టె అన్నదాతలను నిట్ట నిలువునా మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, ప్రజానీకాన్ని మోసం చేయడంలో ఆయన ఆస్కార్ అవార్డును సాధించగలరని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులను, ప్రజానీకం సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందన్నారు. జిల్లాలో 1,64,606 మంది పట్టాలు ఉన్న రైతులు ఉంటే… మూడు విడతల్లో కేవలం 55,961 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారందరికీ మాఫీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ప్రస్తుతం రైతులను నిట్టనిలువునా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హ‌యాంలో కేవలం ఏడాది కాలంలోనే రైతుబందు కింద పదిహేను వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేస్తే…. ప్రస్తుత ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రుణమాఫీ కింద 17 వేల 900 కోట్ల రూపాయలను మాఫీ చేసిందన్నారు. రైతుబందు, రైతు బీమా వంటి పథకాల ఊసెత్తడం లేదని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కుంటున్న ఇక్కట్లను పట్టించుకోవడం లేదన్న ఆయన.. తీసుకున్న ఋణం మొత్తంలో సంపూర్ణ రుణమాఫీ కాకపోవడంతో కార్యాలయాల వద్ద అన్నదాతలు పడిగాపులు కాసే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.బడ్జెట్ లో 26 వేల కోట్లు కేటాయించి.. చివరికి 17 వేల 900 కోట్లను మాఫీ చేశారని మండిపడ్డారు. హరీష్ రావు 31 వేల కోట్ల రుణమాఫీ చేస్తేనే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారని గుర్తు చేసిన ఆయన, రుణమాఫీ విషయంలో సి.ఎం పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. స‌మావేశంలో రోకండ రమేష్, ఎక్స్ ఎంపీపీలో మారిశెట్టి గోవర్ధన్, గండ్రత్ రమేష్, మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రలాద్ బట్టు సతీష్. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *