సిరా న్యూస్;
మిచౌంగ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘మిగ్జామ్’ తుపాను చెన్నై నగరంలో వర్ష బీభత్సం సృష్టించింది. అతి భారీ వర్షాలతో చెన్నై పూర్తిగా జలమయం అయింది. నగరంలో ఎటు చూసినా నీరే. దీనిపై తమిళనాడు పురపాలక శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ స్పందించారు. నగరంలో గత 70-80 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురిసిందని వెల్లడించారు. తనకు తెలిసినంతవరకు చెన్నై ఇంతటి భారీ వర్షాలను ఎప్పుడూ ఎదుర్కోలేదని తెలిపారు. అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ, తుపాను తీవ్రత దృష్ట్యా ఆ చర్యలు సరిపోలేదని వెల్లడించారు. తుపాను విలయం ముందు తమ యంత్రాంగం విఫలమైందని కేఎన్ నెహ్రూ అంగీకరించారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ద్వారా 3 లక్షల మందికి ఆహారం అందిస్తున్నట్టు తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు బోట్లు పంపించామని చెప్పారు. సహాయ చర్యల కోసం 5 వేల మంది సిబ్బందిని ఇతర జిల్లాల నుంచి రప్పించామని వెల్లడించారు. కాగా, చెన్నైలో కుండపోత వానలు కురుస్తుండడంతో విమానాశ్రయంలోకి నీళ్లు ప్రవేశించాయి. దాంతో మూడు విమానాలను బెంగళూరుకు మళ్లించారు. వరద నీరు ప్రవేశించడంతో 14 రైల్వే సబ్ వేలను అధికారులు మూసివేశారు. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాంబరంలో నీటిలో చిక్కుకుపోయిన 15 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. తుపాను కారణంగా నగరంలోని కోర్టులకు సెలవు ఇచ్చినట్టు మద్రాస్ హైకోర్టు ప్రకటించింది. అటు, చెంగల్పట్టు, తిరువళ్లూర్, కాంచీపురం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయిభారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడుపై తుఫాన్ ప్రభావం ఓ రేంజ్లో ఉంది. ముఖ్యంగా చెన్నై నగరం చిగురుటాకులా వణికిపోతోంది. చెన్నైలోని ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.భారీ వర్షాల కారణంగా చెన్నై అంధకారంగా మారింది. భారీ వర్షాల కారణంగా 8 మంది మృతి చెందారు. చెన్నై సహా తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టులో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. అత్యధికంగా ఆవడి ప్రాంతంలో 30 సెం.మీ వర్షపాతం కురిసింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా సబ్వేలు మూసివేశారు. నిత్యవసర సరకుల కోసం జనం ఇక్కట్లు పడుతున్నారు. సహాయక చర్యలు కోసం సైన్యం రంగంలోకి దిగింది.మిచౌంగ్ తుఫాన్ దెబ్బకు చెన్నై అతలాకుతలమైంది. నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు చోట్ల వీధుల్లోకి భారీగా వరద నీరు చేరి పలు కార్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరింది. పలు కాలనీల్లో నీరు నిలిచిపోవడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.