మహిళలు జననాంగాల్లో టాల్కమ్‌ పౌడర్‌ వాడొద్దని నిపుణుల సూచన

ఆరేండ్లపాటు 50 వేల మంది మహిళలపై అధ్యయనంలో వెల్లడి
 సిరా న్యూస్,హైదరాబాద్‌;
ఇంట్లో రోజూ వాడే టాల్కమ్‌ పౌడర్‌తో మహిళల్లో అండాశయ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉన్నదని అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ పరిశోధకులు పేర్కొన్నారు. జననాంగాలపై టాల్కమ్‌ పౌడర్‌ను తరుచుగా వాడే మహిళల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించారు. మహిళలు జననాంగాల్లో టాల్కమ్‌ పౌడర్‌ వినియోగాన్ని నిలిపివేయాలని సూచించారు. 2003-2009 మధ్య అమెరికాలోని 50,884 మంది మహిళలపై ఈ పరిశోధనలు చేసినట్టు వివరించారు. ఈ వివరాలు ‘జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ ఆంకాలజీ’లో ప్రచురితమయ్యాయి.టాల్కమ్‌ పౌడర్‌లో ఆస్బెస్టాస్‌ అనే ఖనిజాన్ని వినియోగిస్తారు. ఇది క్యాన్సర్‌కు కారకంగా పనిచేస్తుందని, దీన్ని పీల్చినా కూడా ప్రమాదమేనని పరిశోధకులు చెబుతున్నారు. ఆస్బెస్టాస్‌ లేని టాల్కమ్‌ పౌడర్‌తో పెద్దగా ప్రమాదం ఉండబోదని పేర్కొన్నారు. కాగా.. పొత్తి కడుపులోకి వ్యాపించే వరకూ అండాశయ క్యాన్సర్‌ను గుర్తించడం కష్టమని వైద్యులు చెబుతున్నారు. ఈ దశలో క్యాన్సర్‌ను నయం చేయడం కష్టమని, తగిన చికిత్స లేకుంటే ఇది మరణానికి దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.
ఏమిటీ అండాశయ క్యాన్సర్‌?
మహిళల్లో సాధారణంగా కనిపించే ఎనిమిది రకాల క్యాన్సర్లలో అండాశయ క్యాన్సర్‌ ఒకటి. అండాలను విడుదల చేసే అండాశయంపై ఇది తొలుత ప్రభావం చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు మూడు లక్షల మంది మహిళలు ఈ క్యాన్సర్‌బారిన పడుతున్నారు. ప్రతీ 87 మంది మహిళల్లో ఒకరికి ఈ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదమున్నట్టు, ప్రతీ 130 మంది మహిళల్లో ఒకరు ఈ క్యాన్సర్‌తో మరణిస్తున్నట్టు ఒవేరియన్‌ క్యాన్సర్‌ రిసెర్చ్‌ అలయన్స్‌ గణాంకాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *