సిరా న్యూస్,ఎమ్మిగనూరు;
గోనెగండ్ల మండల పరిధిలోని గంజిహళ్లి గ్రామంలో నకిలీ వైద్యుడు వేసిన ఇంజెక్షన్ వికటించి అదే గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడు రాజేష్ మృతిచెందాడు. ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. రాజేష్ కు 10 రోజుల క్రితం జ్వరం రావడంతో తల్లిదండ్రులు స్థానిక వైద్యుడు బడేసాహెబ్ ను ఆశ్రయించారు. ఆ వైద్యుడు బాలుడికి ఇంజెక్షన్ వేసిన అనంతరం మూడు రోజులకు ఇంజెక్షన్ వేసిన చోట గడ్డ ఏర్పడింది. ఆ తరువాత గడ్డ నుంచి చీము, రక్తం కారడం తీవ్రం కావడంతో తల్లిదండ్రులు కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వారం రోజుల పాటు వైద్యం చేయించినప్పటికీ నయం కాలేదు. పరిస్థితి విషమించి బాలుడు శరీరం నుంచి చీము, రక్తం రావడంతో పాటు కండ కూడా ఊడిపోవడం, శరీరంలోని ఇతర భాగాలు కూడా చెడిపోయి ఆదివారం చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. బాలుడికి వైద్యం చేసిన ఆ వైద్యుడు గ్రామంలో పశువులకు కూడా వైద్యం చేస్తాడని ఆ గ్రామంలో చెప్పుకుంటున్నారు. ఆ వైద్యుడు పదో తరగతిలోపే చదివినట్లు గ్రామంలో ప్రచారం ఉంది. గత 20 రోజుల క్రితం ఈ వైద్యుడు వేసిన ఇంజెక్షన్ కారణంగా శరీరంపై గడ్డలు వచ్చి చీము కారి కోలుకోలేక 60 ఏళ్లు నిండిన మరో వ్యక్తి మృతి చెందినట్లు కూడా ఆ గ్రామంలో ప్రచారం జోరుగా సాగుతోంది. బాలుడు మృతి చెందిన విషయమై తల్లిదండ్రులు ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. వైద్యారోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే నకిలీ వైద్యులు రోజురోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
=============================