కాలి బూడిదైన 25 క్వింటళ్ల శనగ కుప్ప…
+ జైనథ్ లో దారుణం
+చేన్లో నిల్వ ఉంచిన శనగ కుప్పకు నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు
+ లబోదిబోమంటున్న రైతు సయ్యద్ సాదిక్
+ రంగంలోకి దిగిన పోలీసులు…
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో దారుణం జరిగింది. మండల కేంద్రానికి చెందిన సయ్యద్ సాదిక్ చేన్లో నిల్వ ఉంచిన దాదాపు 25 క్వింటళ్ల శనగకుప్పకు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి నిప్పంటించారు. దీంతో శనగ కుప్ప పూర్తిగా కాలి బూడిదయ్యింది. వివరాల్లోకి వెళితే… సాధిక్ తన మూడెకరాల్లో శనగ పంట వేశాడు. పంట కోతకు రావడంతో, కోత కోసి చేన్లోనే కుప్ప పోశాడు. శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు శనగ కుప్పకు నిప్పంటించడంతో పూర్తిగా కాలి బూడిదయ్యింది. ఆదివారం ఉదయం సాధిక్ చేన్లోకి వెళ్లి చూడగా బూడిద మాత్రమే కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు చేన్లో కాలి బూడిదైన శనగ కుప్పను పరిశీలించారు. రైతుతో మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి…
ఈ ఏడాది మూడు ఎకరాల్లో శనగ పంట సాగు చేశాను. పంట కోతకు రావడంతో కోత కోసి చేన్లోనే కుప్పగా పోసుకున్నాను. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కుప్పకు నిప్పంటించారు. దాదాపు 25 క్వింటాళ్ల శనగ పంట పూర్తిగా కాలి బూడిద అయిపోయింది. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం రూ. 1.20 లక్షలు నష్టపోయాను. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలి.