పెంబి, సిరా న్యూస్
సిఆర్డీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూక్ష్మ సేద్యం పరికరాల పంపిణీ
నిర్మల్ జిల్లా పెంబి మండలం లో పంటలు ఎక్కువగా వర్షాధారంగా సాగు అవుతున్నాయి. రైతులు తమకు అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకునేందుకు సూక్ష్మ నీటి సేద్యం పరికరాల వినియోగానికి రెడీగా ఉన్నారని వ్యవసాయ విస్తరణ అధికారి రాజ్ కుమార్ తెలిపారు. శనివారం మండల కేంద్రం లోని రైతువేదికలో రిలయన్స్ ఫౌండేషన్, సీఆర్డీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఎంపీడీవో సుధాకర్ చేతుల మీదుగా రైతులకి సూక్ష్మ నీటి సేద్యం పరికరాలు, మేకల పెంపకందారులకు షేడ్ నెట్ లతో పాటు కుట్టు మిషన్ లో శిక్షణ తీసుకున్న యువతులకు టైలరింగ్ పరికరాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఏఈవో మాట్లాడుతూ మండల పరిధిలో సాగు నీటి కొరత సమస్య ఎక్కువగా ఉందని, వర్షా కాలంలో సుమారుగా 16 వేల ఎకరాలు సాగులో ఉండగా రబీ లో కేవలం 6 వేల ఎకరాలు మాత్రమే సాగవుతున్నట్లు తెలిపారు. సాగు నీటి సమస్యను అధిగమించేందుకు గాను గత ఐదు సంవత్సరాలుగా వ్యవసాయ శాఖ ద్వారా సూక్ష్మ నీటి పరికరాల పై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో ఉద్యాన శాఖ ద్వారా యంఐపి పథకంలో భాగంగా మండల పరిధిలోని ఎస్సీ , ఎస్టీ రైతులకు సుమారుగా 60 వరకు స్ప్రింక్లర్ యూనిట్లను 100% సబ్సిడీ తో పంపిణీ చేసినట్టు తెలిపారు. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ కూడా మండలంలో మైక్రో ఇరిగేషన్ యూనిట్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ముందుకు రావడం అభినందనీయం తెలిపారు. కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రాజేందర్ రెడ్డి, ఏఈవో గంగాజల, ఐకేపీ సీసీ, రైతులు పాల్గొన్నారు.