టీడీపీ అభ్యర్ధుల్లో భయం

సిరా న్యూస్, విజయవాడ;
ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార వైసిపి దూకుడు మీద ఉంది. ఇప్పటివరకు 53 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది. మరో 30 మందిని మార్చేందుకు కసరత్తు చేస్తోంది. అటు ఎంపీ అభ్యర్థుల మార్పు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు మూడు జాబితాలు విడుదలయ్యాయి. మలి విడత జాబితా రానున్నట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే వైసిపి వేగంగా అడుగులు వేస్తుండగా.. తెలుగుదేశం పార్టీ నుంచి ఆ స్థాయిలో ప్రకటన రావడం లేదు. అభ్యర్థులు ఖరారు కావడం లేదు. జనసేనతో పొత్తులో ఉండడం ఒక కారణమైతే.. బిజెపి కలిసి వస్తుందని ఎదురుచూపు మరో కారణం.తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తుంది? ఇస్తే ఎక్కడిస్తుంది? జనసేన ఎన్ని స్థానాలు అడుగుతుంది? ఆ పార్టీకి బలమైన నియోజకవర్గాలు ఎన్ని? పొత్తులో భాగంగా టిడిపి వదులుకోవలసిన స్థానాలు ఎన్ని? కొత్తగా బిజెపి కూటమిలో చేరితే ఎక్కడ సర్దుబాటు చేస్తారు? నగర ప్రాంతాల్లోనా? గ్రామీణ నియోజకవర్గాలా? ఇప్పుడు ఏ ఇద్దరు టిడిపి నాయకులు కలిసినా ఇదే చర్చ నడుస్తోంది. తమ అవకాశాలకు ఎక్కడ గండి పడుతుందోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.
ప్రధానంగా ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు, విశాఖ జిల్లాలో జనసేనకు తెలుగుదేశం పార్టీ సీట్లు కేటాయించే అవకాశం ఉంది. అయితే జనసేన సైతం ఉమ్మడి 13 జిల్లాల్లో.. ప్రతిచోట ప్రాతినిధ్యం ఉండాలని కోరుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో సింహభాగం స్థానాలు ఆశిస్తోంది. విశాఖ తో పాటు గుంటూరు,కృష్ణ జిల్లాల్లో కాపులు అధికంగా ఉండే నియోజకవర్గాలను కోరుతోంది. దీంతో అక్కడ టికెట్ ఆశిస్తున్న ఆశావహులు, నాయకులు ఆందోళనతో ఉన్నారు. ఎక్కడ పొత్తులో భాగంగా తమ సీటు పోతుందన్న బెంగ వారిని వెంటాడుతోంది. మరోవైపు బిజెపి కూటమిలోకి వస్తే.. సీట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా నగరాల్లో బిజెపి సీట్లు ఆశిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయవాడ, విశాఖ, గుంటూరు వంటి నగరాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో తాము బలంగా ఉన్నట్లు బిజెపి చెబుతోంది. ఒకవేళ అక్కడ సీట్లను బిజెపి కోరితే మాత్రం.. చాలామంది టీడీపీ నేతలు త్యాగాలు చేయాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *